Guntur Kaaram: మరికొద్ది గంటల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఈ క్రమంలో బయట ఎక్కడ చూసినా “గుంటూరు కారం” సినిమా నుండి విడుదలైన “కుర్చీ మడతపెట్టి” సాంగ్ మారుమొగుతుంది. ఈ సినిమా నుండి మూడో పాటగా విడుదలైన “కుర్చీ మడతపెట్టి” యూట్యూబ్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ లో నిలిచింది. విడుదలైన 24 గంటల్లోనే 43 లక్షలకు పైగా వ్యూస్ తో దూసుకెళ్తోంది. ఈ పాటలో మహేష్ బాబు మరియు శ్రీలీల వేసిన మాస్ స్టెప్ లు అందరిని ఆకట్టుకుంటున్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ఈ పాట లిరిక్స్ పై నెగటివ్ స్పందన వచ్చినప్పటికీ యూట్యూబ్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ గా నిలవడం విశేషం. మరోపక్క ఈ సాంగ్ విషయంలో తమన్ నీ గట్టిగా ట్రోలింగ్ చేస్తున్నారు. తమన్ మళ్లీ కాపీ కొట్టాడని ఆడేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రంలో “పెట్రాయి స్వామి దేవుడా”, ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో నాగచైతన్య తమన్నా నటించిన 100% లవ్ సినిమాలో “పిల్ల నీ బావనిస్తావా” అనే పాట ట్యూన్ కాపీ కొట్టి “కుర్చీ మడతపెట్టి” సాంగ్… కొట్టాడని నేటిజన్లు పలు వీడియోలు క్రియేట్ చేసి మరీ వాటిని వైరల్ చేస్తున్నారు.
రెండు కూడా దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన సినిమాలు. దీంతో డిఎస్పి మ్యూజిక్ నీ తమన్ కాపీ కొడుతున్నాడని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా జనవరి 12వ తారీకు సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కాబోతోంది. దీంతో “గుంటూరు కారం” నుంచి మేకర్స్ వరుస పెట్టి అప్ డేట్స్ విడుదల చేస్తున్నారు. కాగా జనవరి 6వ తారీకు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అదే రోజు ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు టాక్. చాలాకాలం తర్వాత ఈ సినిమాలో మహేష్ స్మోకింగ్ చేయడంతో పాటు లుంగీ కట్టడంతో.. కచ్చితంగా మాస్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.