యుకేలో కొత్త రకం కరోనా వైరస్ స్టెయిన్ విజృంభిస్తున్న నేపథ్యంలో పలు దేశాల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ, ఇజ్రాయిల్, ఎల్ సాల్వాడాగ్, బల్గేరియా, ఆస్ట్రియా, ఇర్లాండ్, వంటి దేశాలు యుకే విమానాలపై నిషేదం విధించాయి. జర్మనీ కూడా అదే నిర్ణయం తీసుకోనున్నది. ఈ వైరస్ స్ట్రెయిన్ 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతోందని బ్రిటన్ ప్రధాని బోరిన్ జాన్సన్ వెల్లడించారు.
ఈ నేపథ్యంలో భారత ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. దీనిపై చర్చించేందుకు కోవిడ్ 19 జాయింట్ మానటరింగ్ గ్రూపు (జేఎంసీ) ను సోమవారం అత్యవసర సమావేశం అవుతోంది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది. “ఆరోగ్య సేవల డీజీ అధ్యక్షతన జాయింట్ మానటరింగ్ గ్రూపు (జెఎంజీ) అత్యవసరంగా భేటీ కానున్నది. కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ గురించి వారు ఈ సమావేశంలో చర్చించనున్నారు” అని ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మానటరింగ్ గ్రూపులో డబ్ల్యుహెచ్ఒ భారత ప్రతినిధి రోడరీకో ఓఫ్రిన్ ఉన్నారు. ఆయన కూడా ఈ సమావేశానికి హజరుకానున్నట్లు సమాచారం.
మరో పక్క కొత్త రకం కరోనా వైరస్ ముప్పుతో బ్రిటన్ నుండి బయటపడేందుకు వేలాది మంది ప్రయత్నిస్తున్నారు. లండన్ లోని హీత్రో విమానాశ్రయం వేల మంది ప్రయాణీకులతో కిక్కిరిసిపోయింది. డబ్లిన్, ఇర్లాండ్ కు వెళ్లే చివరి విమానం ఎక్కేందుకు వీరంతా పోటీ పడుతున్నారు.