Covid Vaccine: కరోనా సెకండ్ వేవ్ పలు దేశాలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. ఫిలిప్పీన్ దేశంలో నిత్యం వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గత వారం రోజులుగా యావరేజ్ అయిదు నుండి ఆరు వేల కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడి చర్యలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రభుత్వం నిర్వహిస్తున్నా ప్రజలు ఎక్కువగా టీకా వేయించుకునేందుకు మొగ్గు చూపడం లేదు. దీంతో ప్రజల తీరు పట్ల ఆ దేశ అధ్యక్షుడు రోడ్రిగో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వ్యాక్సిన్ నిరాకరిస్తున్న వారికి ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నందున ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని కూడా హెచ్చరించారు. అయినా వ్యాక్సిన్ వద్దనుకున్నవారు భారత్ లేదా అమెరికాలో ఏదో ఒక దేశానికి వెళ్లాలని వ్యాఖ్యానించారు అధ్యక్షుడు రోడ్రిగో. ప్రస్తుతం తాను తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు నచ్చకపోవచ్చు కానీ కరోనా వల్ల ఎమర్జెన్సీ పరిస్థితులు ఎందుర్కొంటున్న ఈ తరుణంలో కఠిన నిబంధనలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. వ్యాక్సిన్ తీసుకోనివారు వైరస్ వ్యాప్తి చేస్తూనే ఉంటారని అలాంటి వారి వలల్ దేశానికి ప్రమాదం అని అన్నారు.
ప్రస్తుత పరిస్థితులు గమనించి ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని అధ్యక్షుడు సూచించారు. లేదంటే పందులకు ఇచ్చే ఐవర్మెక్టిన్ ఇంజక్షన్ ఇస్తామని హెచ్చరించారు రోడ్రిగో. దీంతో వైరస్ తో పాటు వారు చచ్చిపోతారని వ్యాఖ్యానించారు. అధ్యక్షుడు రోడ్రిగో ఇంతకు ముందు లాక్ డౌన్ సమయంలో కఠిన హెచ్చరికలు జారీ చేశారు. లాక్ డౌన్ సమయంలో బయటకు ఎవరైనా వస్తే కాల్చి చంపేయండి అంటూ కూడా మిలటరీని ఆదేశించారు. మరో పక్క లాక్ డౌన్ సమయంలో ప్రజల ఎవరూ ఇబ్బందిపడకుండా ఉండేందుకు నాలుగు బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
Read More: AP SEC: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల రద్దును హైకోర్టులో సవాల్ చేసిన ఎస్ఈసీ