ఉత్తరప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. యూపిలో ఈ నెల 16న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 296 కిలో మీటర్ల బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వేను ప్రారంభించిన సంగతి తెలిసిందే. చిత్రకూట్ లోని భరత్ కూప్ నుండి ఇటావాలోని కుంద్రేల్ ను కలిపే ఈ నాలుగు లైన్ల ఎక్స్ ప్రెస్ వే ను యోగి సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా దాదాపు రూ.15వేల కోట్లతో నిర్మించింది. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జులౌన్ జిల్లా సమీపంలో ఈ ఎక్స్ ప్రెస్ వే పై కొన్ని చోట్ల పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. నాలుగు రోజులు కురిసిన భారీ వర్షానికే కోట్లాది రూపాయలతో నిర్మించిన ఎక్స్ ప్రెస్ వే పై భారీ గుంతలు ఏర్పడటంతో నిర్మాణంలో నాణ్యత లోపం బట్టబయలైంది.
ప్రధాన మంత్రి మోడీ ప్రారంభించిన వారం రోజుల్లోనే ఎక్స్ ప్రెస్ వే పై గుంతలు ఏర్పడటంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తరచు ప్రభుత్వ విధానాలపై ప్రశ్నల వర్షం కురిపించే సొంత పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ ఈ అంశంపైనా ట్విట్టర్ వేదికగా స్పందించారు. వారం రోజుల్లోనే రోడ్డు ఇలా అయితే ఎలా అంటూ ప్రశ్నలు సంధించారు. ఈ ప్రాజెక్టు హెడ్, నిర్మాణంలో భాగస్వాములైన కంపెనీలు, ఇంజనీర్లకు వెంటనే సమన్లు జారీ చేయాలని అన్నారు. బాధ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వరుణ్ గాంధీ. సొంత పార్టీ ఎంపీనే ఇలా బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో ప్రతిపక్ష నేతలు మాటల దాడి చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వ తీరుపై సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. రోడ్డు నిర్మాణ విషయంలో ఇంజనీర్ లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూపి కాంగ్రెస్ కూడా ఈ ఎక్స్ ప్రెస్ వే నిర్మాణంపై విమర్శలు సంధించింది.
ప్రతిపక్షాల నుండి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పెద్ద ఎత్తున బుల్ డోజర్ లను పంపి యుద్ద ప్రాతిపదికన మరమ్మత్తులు పూర్తి చేసి ఎక్స్ ప్రెస్ వే పై వాహనాల రాకపోకలను పునరుద్దరించారు.
ఉచిత హామీలు ప్రగతి నిరోధకాలు అంటూ ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు