దేశ వ్యాప్తంగా ఈ నెల 16వ తేదీ నుండి మొదటి దశ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించేందుకు కేంద్రం చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కరోనా టీకా పంపిణీ సన్నాహాలపై నేడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్ సమావేశంలో భేటీ అయ్యారు. వ్యాక్సిన్ పంపిణీ ఏర్పాట్లపై సీఎంలతో చర్చించారు. తొలి దశ వ్యాక్సిన్ పంపిణీ ఎవరెవరికి పంపిణీ చేయనున్నారు అనే దానిపై క్లారిటీ ఇచ్చారు.
రాజకీయ నేతలు క్యూకట్టవద్దు
తొలి దశలో ప్రైవేటు లేదా ప్రభుత్వ రంగాలకు చెందిన మూడు కోట్ల మంది కరోనా యోధులకు వ్యాక్సిన్ ఇస్తామన్నారు. అయితే వీరిలో ప్రజా ప్రతినిధులు ఉండరని తెల్చిచెప్పేశారు. కరోనా వ్యాక్సిన్ ముందుగా పొందేందుకు రాజకీయ పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులు క్యూకట్టవద్దని సూచించారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు తమ వంతు వచ్చే వరకూ రాజకీయ నేతలు వేచి ఉండాలని మోడీ సూచించారు.
హర్యానా, బీహార్, ఒడిశా నేతలకు టీకాపై క్లారిటీ
నవంబర్ 24వ తేదీన ముఖ్య మంత్రులతో మోడీ జరిపిన సమావేశంలో హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖత్తర్ ఈ విజ్ఞప్తి చేశారు. మొదటి దశ టీకాలు వేసే జాబితాలో ఎంపిలు, ఎమ్మెల్యేలు వంటి ప్రజా ప్రతినిధులను చేర్చాలని కోరారు. ఆ సమయంలో మోడీ స్పందించలేదు. ఆ తరువాత గత వారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ నిర్వహించిన సమావేశంలోనూ ఇదే తరహా డిమాండ్ వచ్చింది. బీహార్, ఒడిశా ఆరోగ్య శాఖా మంత్రులు.. పంచాయతీల నుండి పార్లమెంట్ వరకూ ప్రజా ప్రతినిధులను ఫ్రంట్ లైన్ యోధులుగా పరిగణించి తొలి దశలోనే టీకాలు వేయాలని కోరారు. ఈ సమయంలో హర్షవర్థన్ కూడా క్లారిటీ ఇచ్చారు. ఒకే విడతగా దేశంలోని ప్రతి ఒక్కరికీ టీకాలు వేయడం సాధ్యం కాదన్నారు. అందు వల్ల ప్రాధాన్యతా క్రమాన్ని నిర్ణయించడం జరిగిందని తెలిపారు. నేడు ప్రధాన మంత్రి మోడీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.
తొలి దశ వ్యాక్సిన్ ఖర్చంతా కేంద్రానిదే
కోటి మంది హెల్త్ వర్కర్లు, రెండు కోట్ల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లకు తొలి దశ వ్యాక్సినేషన్ లో భాగంగా ఉచితంగా టీకాను ఇస్తామని మోడీ తెలిపారు. తొలి దశ వ్యాక్సిన్ ఖర్చు అంతా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని, రాష్ట్రాలపై ఎలాంటి భారం పడదని మోడీ స్పష్టం చేశారు. మూడు కోట్ల టీకాల పంపిణీ తరువాత మరో సారి ముఖ్యమంత్రులతో భేటీ అవుతానని తదుపరి కార్యాచరణపై ఆ సమావేశంలో చర్చిద్దామని మోడి పేర్కొన్నారు. రెండవ దశలో 50 ఏళ్ల పైబడిన వారికి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 50 ఏళ్ల లోపు వారికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కేవలం 2.5 కోట్ల మంది మాత్రమే టీకా తీసుకున్నారని మోడి అన్నారు.
జులై నాటికి దేశంలో 30 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే దాదాపు అన్ని జిల్లాల్లో వ్యాక్సినేషన్ డ్రైరన్ పూర్తి అయినట్లు వెల్లడించారు. టీకాపై వదంతులు వ్యాపించకుండా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రులకు సూచించారు. శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు తీసుకున్న తరువాతే టీకాపై నిర్ణయం తీసుకున్నామని మోడీ తెలిపారు. ఇప్పటికే రెండు స్వదేశీ వ్యాక్సిన్ లకు అత్యవసర వినియోగానికి అనుమతులు ఇవ్వగా, మరో నాలుగు టీకాలను కూడా త్వరలో అందుబాటులోకి తెస్తామని మోడి తెలిపారు.