భారతదేశ త్రివిధ దళాధిపతి గా రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ నియమితులైయ్యారు. గత ఏడాది హెలికాఫ్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ మరణించిన నేపథ్యంలో .. ఆయన స్థానాన్ని భర్తీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా కూడా అనిల్ చౌహాన్ బాధ్యతలు నిర్వహిస్తారు. ఈస్ట్రన్ ఆర్మీ కమాండర్ గా పని చేసిన అనిల్ చౌహాన్ గత ఏడాది మే నెలలో రిటైర్ అయ్యారు. అనంతరం జాతీయ భద్రతా మండలిలో చేరారు. ప్రస్తుతం ఆయన జాతీయ భద్రతా మండలి సలహాదారుగా ఉన్నారు. ఇప్పుడు ఆయన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) గా బాధ్యతలు చేపట్టనున్నారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఆ పదవిలో చౌహాన్ కొనసాగుతారని కేంద్రం స్పష్టం చేసింది.
దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సైన్యంలో సేవలు అందించిన అనిల్ చౌహాన్ ..పరమ్ విశిష్ట్ సేవా పతకం, ఉత్తమ్ యుద్ద సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, సేనా పతకం, విశిష్ట్ సేవా పతకం అందుకున్నారు. ఎన్డీఏ సర్కార్ సీడీఎస్ వ్యవస్థ తీసుకువచ్చిన తర్వాత 2020 జనవరి 1న భారత దేశ తొలి సీడీఎస్ గా జనరల్ బిపిన్ రావత్ ను నియమించింది. ఆయన ఆ పదవిలో ఉండగానే గత ఏడాది డిసెంబర్ 8న తమిళనాడులోని కూనూర్ సమీపంలో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆ ప్రమాదంలో రావత్ సహా 14 మంది మృతి చెందారు. రావత్ మరణానంతరం సీడిఎస్ గా ఎవరిని నియమించాలనే దానిపై దాదాపు 9 నెలల పాటు విస్తృత కసరత్తు చేసిన కేంద్ర ప్రభుత్వం చివరకు అనిల్ చౌహాన్ ను ఎంపిక చేసింది.
Breaking: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఇండోస్పిరిట్ గ్రూప్ ఎండీ సమీర్ మహేంద్రుడిని అరెస్టు చేసిన ఈడీ