Breaking: లడ్డాఖ్ లోని ఖేరీ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీ జవాన్ లు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాద వశాత్తు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ సహా తొమ్మిది మంది దుర్మరణం పాలైయ్యారు. లేహ్ నుండి 150 కిలో మీటర్ల దూరంలోని ఖేరీ ప్రాంతం వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో పది మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
వాహనం డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సీనియర్ ఎస్పీ పీడీ నిత్యా తెలిపారు. సమాచారం తెలియగానే పోలీసు బృందం ఘటనా స్థలానికి వెళ్లిందనీ, గాయపడిన సైనికులను ఆర్మీ ఆసుపత్రికి తరలించినట్లు ఆమె వివరించారు. అప్పటికే ఎనిమిది మంది మృతి చెందారనీ, ఆ తర్వాత మరో జవాన్ మృతి చెందినట్లు తెలిపారు. ప్రస్తుతం గాయాలతో చికిత్స పొందుతున్న ఒక జవాన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తొంది.
లడ్డాఖ్ లో జరిగిన ప్రమాదంలో వీర సైనికులను కోల్పోవడం బాధాకరమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఈ విషాద సమయంలో యావత్ దేశం మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తుందన్నారు. అమరులైన జవాన్లకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ఘటనలో గాయపడిన జవాన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి అదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. భారతమాత వీర పుత్రులకు వినయపూర్వకంగా నివాళులర్పిస్తున్నట్లు ట్వీట్ చేశారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తదితర ప్రముఖులు లడ్డాఖ్ ప్రమాదంలో సైనికులు మృతిపై సంతాపం తెలియజేశారు. ఘటనపై విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.
ఏపీ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ హవా