Qatar: భారత నౌకాదళానికి చెందిన మాజీ అధికారుల మరణశిక్ష వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎనిమిది మంది భారతీయులకు విధించిన మరణ శిక్షను సవాల్ చేస్తూ భారత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను ఖతార్ కోర్టు అనుమతించింది. ఈ మేరకు నిర్బంధంలో ఉన్న మాజీ నావీ అధికారుల కుటుంబాలకు సమాచారం అందినట్లు తెలుస్తొంది. అప్పీల్ ను పరిశీలించిన తర్వాత ఖతార్ కోర్టు విచారణ తేదీని నిర్ణయిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.
ఎనిమిది మంది వ్యక్తులను గూఢచర్యం కేసులో ఖతార్ గూఢచార సంస్థ 2022 ఆగస్టు 30న అరెస్టు చేసింది. ఇదే సమయంలో ఖతార్ అధికారులు భారత అధికారులపై ఉన్న ఆరోపణలను బహిర్గతం చేయలేదు. అయినప్పటికీ నేవీ అధికారుల బెయిల్ పిటిషన్లు చాలా మార్లు తిరస్కరణకు గురయ్యాయి. గత అక్టోబర్ నెలలో దేశ న్యాయస్థానం వీళ్లకు మరణశిక్ష విధిస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై భారత ప్రభుత్వం దిగ్భాంతి వ్యక్తం చేస్తూ ఈ అంశాన్ని తీవ్రమైనదిగా పరిగణించింది. ఎనిమిది మంది మాజీ నేవీ సిబ్బందికి మరణశిక్ష విధించడంపై ఖతార్ లో అప్పీల్ దాఖలు చేసినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి నవంబర్ 9న వెల్లడించారు. ఈ తీర్పు రహస్యంగా దని, న్యాయ బృందంతో మాత్రమే దీనిపై చర్చిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు తదుపరి చట్టపరమైన చర్యలను కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మరణ శిక్ష పడిన వారిలో కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్, కమాండర్ అమిత్ నాగ్ పాల్, కమాండర్ తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా, సెయిలర్ రాగేగ్ గోపకుమార్ లు ఉన్నారు. ఈ అధికారులందరూ ఇండియన్ నేవీలో 20 ఏళ్లకు పైగా విశిష్ట సేవలు అందించారు. అయితే ఖతర్ అదుపులో ఉన్న మాజీ అధికారుల్లో ఒకరి సోదరి మీటూ భార్గవ తన సోదరుడిని తిరిగి తీసుకువచ్చేందుకు కేంద్రం సహాయం కోరింది. ఈ మేరకు ప్రధాని మోడీ జోక్యం చేసుకోవాలని, మాజీ నావికాదళ అధికారుల దేశానికే గర్వకారణమని, అలస్యం చేయకుండా వారందరినీ వెంటనే తిరిగి తీసుకురావాలని కోరారు.