Baba: వారిద్దరూ బాబాలు. ఇద్దరూ బాబాలే. అయితే, ఈ ఇద్దరిలో ఒకరికి గుడ్ న్యూస్ మరొకరికి బ్యాడ్ న్యూస్. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఆశారాం బాపు తాత్కాలిక బెయిల్ పిటిషన్ ను రాజస్థాన్ హైకోర్టు తోసిపుచ్చింది. మరోవైపు వాదాస్పద ఆధ్యాత్మిక గురువు, డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్కు పెరోల్ దొరికింది.
ఇద్దరూ ఇద్దరే…
డేరా బాబా తన ఇద్దరు మహిళా శిష్యులపై అత్యాచారం, జర్నలిస్టు రామ్ చందర్ ఛత్రపతిని హత్య చేసిన ఆరోపణలపై 20 ఏళ్ల జైలు శిక్షకు గురయ్యారు. అస్వస్థతతో ఉన్న తన తల్లిని చూసేందుకు 21 రోజుల పెరోల్ కోరుతూ ఈనెల 17న ఆయన దరఖాస్తు చేసుకోగా.. రాష్ట్ర పోలీసులు ఇందుకు అనుమతించారు. దీంతో రోహ్తక్లోని సునరియా జైలు నుంచి శుక్రవారం ఉదయం ఆయన పెరోల్పై విడుదలయ్యారు. పెరోల్లో ఉన్న సమయంలో శిష్యుల తాకిడి ఉండకుండా చూసేందుకు ఆయన ఉండే ప్రాంతాన్ని రహస్యంగా ఉంచారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. తన తల్లిని కలుసుకునేందుకు వీలుగా భారీ భద్రత మధ్య ఆయన్ను రోహ్తక్ తీసుకువెళ్లారు.
ఈ బాబాకు బ్యాడ్ లక్
ఇటీవల ఆశారాం బాపూకు కరోనా సోకడంతో ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. క్వారెంటైన్ పూర్తయినందున ఆయన్ను తీసుకువెళ్లవచ్చని ఎయిమ్స్ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. అయితే, అనారోగ్య కారణాలను సాకుగా పేర్కొంటూ ఆశారాం బాపూ తాత్కాలిక బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించాడు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్న తాను హరిద్వార్ లో ఆయుర్వేద వైద్యం చేయించుకునేందుకు అనుమతించాలని.. దీని కోసం తనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని ఆశారాం బాపు హైకోర్టును కోరారు. రాజస్థాన్ హైకోర్టు డివిజన్ బెంచ్ జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ దేవేంద్ర కచ్వాహా పిటిషన్ పై విచారించి బెయిల్ అవసరం లేదని తీర్పు వెలువరించింది. అయితే అనారోగ్య సమస్యల కోసం మెరుగైన ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించాలని జైలు అధికారులను ఆదేశించింది.