పార్లమెంటు శీతాకాల సమావేశాలలో వాయిదాల పర్వం కొనసాగుతున్నది. శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి విపక్షాల నిరసనలతో సభా కార్యక్రమాలు జరగకుండా వాయిదాలు పడుతూనే వస్తున్నది. గత సమావేశాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం లోక్ సభ సమావేశం కాగానే విపక్షాల వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు.
విపక్షాలు వివిధ అంశాలపై తన నిరసన తెలియజేస్తూ వెల్ లోకి దూసుకెళ్లి నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అటు రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. సభ్యుల ఆందోళనలు, నిరసనలు, నినాదాల మధ్య రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సభను రేపటికి వాయిదా వేశారు.