(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
ప్రస్తుతం సమాజంలో మహిళలు, బాలికలపై లైకింక వేధింపులు ఎక్కవగా జరుగుతున్నాయి. ముఖ్యంగా అభం సుభం తెలియని చిన్నారులపై కామాంధులు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. దీంతో అటపాటలతో సరదాగా సాగాల్సిన చిన్నారులు కామాందుల కబంధ హస్తాల్లో చిక్కుకుని శారీరకంగా, మానసికంగా కుంగిపోతున్నారు.
రాష్ట్రంలో గత సంవత్సరం ఏప్రిల్ నెల నుండి ఈ ఏడాది ఆగస్టు వరకూ చైల్డ్ వెల్ఫేర్ కమిటి దృష్టికి వచ్చిన వివరాల ప్రకారం చిన్నారుల వేధింపులకు సంబంధించి 4,700 కేసులు నమోదు అయ్యాయి. పలు సంఘటనలు జరిగిన తర్వాత బాధితుల ఫిర్యాదు మేరకు సిడబ్ల్యుసీ దృష్టికి రాగా, మరి కొన్ని సంఘటనలు పోలీస్ శాఖ నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం ద్వారా వెలుగులోకి వచ్చాయి. పలకా బలపం పట్టుకుని పాఠశాలలకు వెళ్లాల్సిన వయస్సులో ఆకలి తీర్చుకోవడానికి యాచన వృత్తికి మళ్లించడం, బాల కార్మికులుగా మార్చడం వల్ల వారు చట్టవిరుద్దమైన పనుల్లో చిక్కుకుంటున్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.
అధికంగా పశ్చిమ గోదావరిలో కేసులు
దేశ వ్యాప్తంగా చిన్నారులపై జరిగిన వేధింపులకు సంబందించి రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం వివరణ కోరగా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కేంద్రానికి నివేదక అందజేసింది. ఆ లెక్కల ప్రకారం చిన్నారులపై వేధింపుల కేసులు అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 1,172 నమోదు అయినట్లు లెక్కలు చెబుతున్నాయి. శ్రీకాకుళంలో 781, ప్రకాశంలో 674, విశాఖలో 516లు, కడపలో 239గ, విజయనగరంలో 106 కేసులు నమోదు అయ్యాయి.
కరోనా లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు, వసతి గృహాలు మూతపడిన పడిన విషయం తెలిసిందే. సంరక్షణ కేంద్రాల్లో ఉన్న చిన్నారులను ఇళ్లకు పంపించారు. తల్లిదండ్రుల సంరక్షణలో పిల్లలు ఉన్నా బాలికలపై వేదింపులు తగ్గలేదు. సాధారణ రోజుల కంటే కరోనా లాక్ డౌన్ కాలంలో భౌతిక, లైంగిక వేధింపులు కాస్త తగ్గినట్లుగా నివేదికలు చెబుతున్నాయి. లాక్ డౌన్ ప్రారంభమైన మార్చి నెల నుండి ఆగస్టు వరకూ మధ్య కాలంలో 1,642 కేసులు నమోదు అయ్యాయి. లాక్ డౌన్ కాలంలోనూ పశ్చిమ గోదావరి జిల్లాలోనే అత్యధికంగా చిన్నారులపై 577 వేధింపు ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
ప్రధానంగా చిన్నారులను ఒంటరిగా వదలడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనీ నిపుణులు పేర్కొంటున్నారు. చిన్నారుల పట్ల పెద్దల పర్యవేక్షణ ఉంటే వీటిని నివారించవచ్చని పేర్కొంటున్నారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దృష్టికి వచ్చిన ప్రతి కేసును విచారించిన ఎలాంటి సంరక్షణ లేని 1,224 మంది పిల్లలను ప్రభుత్వ ప్రత్యేక వసతి కల్పించారు. మిగిలిన 3212 మంది చిన్నారులను వారి తల్లిదండ్రులకు అప్పగించారు.