జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీతో కలిసి పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చింది. వచ్చే ఎన్నికలలో జనసేన 24 అసెంబ్లీ సీట్లతో పాటు మూడు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయనుంది. ఈ విషయాన్ని టిడిపి అధినేత చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ఇక తొలి జాబితాలో పవన్ కళ్యాణ్ నెల్లిమర్ల, రాజానగరం, కాకినాడ రూరల్, తెనాలి, అనకాపల్లి స్థానాలకు అభ్యర్థులను కూడా ప్రకటించారు.
ఇక తొలి జాబితాలో భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పేరు తప్పకుండా ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే తొలి జాబితాలో పవన్ పేరు లేకపోవడంతో జనసేన వర్గాలు కూడా షాక్ అయ్యాయి. గత ఎన్నికలలో పవన్ భీమవరంతో పాటు గాజువాక నుంచి రెండు చోట్ల పోటీ చేశారు. అయితే రెండు చోట్ల ఓడిపోయారు. భీమవరంలో గట్టి పోటీ ఇవ్వగా.. గాజువాకలో మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. అయితే ఈసారి తెలుగుదేశం పార్టీతో పొత్తు నేపథ్యంలో పవన్ భీమవరంలో పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుస్తారని రాజకీయ వర్గాల్లో అంచనా ఉన్నాయి.
అయితే అనూహ్యంగా టిడిపి నుంచి జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు సైతం తాను భీమవరం నుంచి జనసేన బరిలో ఉంటానని ప్రకటించారు. ఇదిలా ఉంటే పవన్ అసెంబ్లీకి పోటీ చేసేందుకు ఏడు ఎనిమిది నియోజకవర్గాలలో సర్వే చేయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. తాను గతంలో పోటీ చేసిన భీమవరం, గాజువాక తో పాటు చిరంజీవి ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తిరుపతి, కృష్ణా జిల్లాలో పార్టీ బలంగా ఉన్న అవనిగడ్డ పోటీ చేయాలని అనుకుంటున్నారు.
అలాగే గతంలో ప్రజారాజ్యం గెలిచిన మరో సీటు తాడేపల్లిగూడెంతో పాటు కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గాలలో కూడా పవన్ పోటీ చేస్తే ఎలా ? ఉంటుంది అన్నదానిపై సర్వే జరిగినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా టిడిపి – జనసేన పొత్తులో పవన్ గోదావరి, ఉత్తరంధ్రలో కాపులు బలంగా ఉన్న నియోజకవర్గాలలో ఎక్కడ పోటీ చేసిన చాలా సులువుగా విజయం సాధిస్తారు అనటంలో సందేహం లేదు. అయినా పవన్ పోటీ చేసే నియోజకవర్గం కోసం ఏకంగా 7 – 8 స్థానాల్లో సర్వే జరగటం అంటే పవన్ తన పోటీ చేసి స్థానంపై చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.