7th Pay Commission: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం డీఏ పెంచిన సంగతి తెలిసిందే. పెరిగిన డీఏ 2021 జూలై 1 నుండి అమల్లోకి వస్తుంది. అంటే పెరిగిన డీఏతో ఆగస్టు వేతం వస్తుంది. ఇప్పటి వరకూ 17 శాతం డీఏ పొందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు అదనంగా మరో 11 శాతం డీఏ పొందనున్నారు. దీంతో వారికి ఆగస్టులో వచ్చే వేతనంలో 28 శాతం డీఏ వస్తుంది.
ఇదే కాకుండా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ కూడా అందిస్తోంది. డీఏ పెంచిన కేంద్ర ప్రభుత్వం హెచ్ఆర్ఏ కూడా పెంచనున్నది. జూలై ఒకటి నుండి 28 శాతం డీఏ అమల్లోకి రావడంతో హెచ్ఆర్ఏ కడా సవరించారు. ఆగస్టులో వచ్చే వేతనంలో డీఏ పెరగడంతో పాటు హెచ్ఆర్ఏ కూడా పెరగుతోంది. హెచ్ఆర్ఏ వేర్వేరు కేటగిరిలో ఉంటుంది. ఉద్యోగులకు 1 నుండి 3 శాతం హెచ్ఆర్ఏ పెరగవచ్చు. 50 లక్షల కన్నా ఎక్కువ జనాభా ఉంటే ఎక్స్ కేటగిరి, 5లక్షల కన్నా ఎక్కువ జనాభా ఉంటే వై కేటగిరి, 5లక్షల లోపు జనాభా ఉంటే జడ్ కేటగిరీ కింద పరిగణిస్తారు. ఎక్స్ కేటగిరి పట్టణాల్లో నివసించే వారికి బేసిక్ పేలో 27 శాతం హెచ్ఆర్ఏ, వై క్లాస్ పట్టణాల్లో నివసించే వారికి 18 శాతం, ఇక జడ్ కేటగిరి పట్టణాల్లో నివసించే వారికి 9 శాతం హెచ్ఆర్ఏ లభించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం కేటగిరిల వారీగా హెచ్ఆర్ఏ రూ.5,400, రూ.3,600లు, రూ.1,800 చెల్లిస్తోంది. ఇక డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎక్స్ పెండీచర్ ప్రకారం డీఏ అలవెన్స్ 50 శాతానికి చేరుకుంటే గరిష్టంగా హెచ్ఆర్ఏ 30శాతం ఇవ్వాలి. డీఏ పెరగడంతో ఉద్యోగులకు రూ.2వేల నుండి రూ.25వేల వరకూ వేతనం పెరిగే అవకాశం ఉంది.