తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ కు సమీపంలోని పాతాళగంగ వద్ద ఉన్న శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో గురువారం రాత్రి 10.30 నిమిషాలకు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ ఘటనలో మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఆరుగురి మృతదేహాలను వెలికితీయగా.. మరో ముగ్గురి మృతదేహాలను వెలికితీయాల్సి ఉంది.
సీఐఎస్ఎఫ్, ప్రత్యేక బృంధాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. అయితే.. విద్యుత్ కేంద్రం లోపల దట్టంగా పొగలు అలుముకోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.
ప్యానల్ బోర్డులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో విద్యుత్ కేంద్రంలోని ఆరు యూనిట్లలో మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో విద్యుత్ కేంద్రంలో 30 మంది సిబ్బంది డ్యూటీలో ఉన్నారు. వారిలో 15 మంది వెంటనే సొరంగ మార్గం ద్వారా బయటికి వెళ్లగా… మరో ఆరుగురు ఉద్యోగులను సహాయక సిబ్బంది రక్షించారు. ఇక… మిగిలిన 9 మంది మాత్రం విద్యుత్ కేంద్రం లోపలే చిక్కుకుపోయారు.
అయితే.. వాళ్లు చిక్కుకుపోయి ఉంటారని.. తెల్లారాక బయటికి వస్తారని అంతా భావించారు. కానీ.. వారంతా మృతిచెందేసరికి.. మృతుల కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి.
విద్యుత్ కేంద్రంలో సహాయక చర్యలను తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి, ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు, నాగర్ కర్నూల్ కలెక్టర్ తదితరులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.