రాజకీయ నాయకులంటే ఎంత సంయమనంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఒక్క మాట తడబడినా.. అది జీవితాంతం వెంటాడుతుంది. తాజాగా సినీ నిర్మాత బండ్ల గణేష్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. తాజాగా ఆయనపై మళ్లీ సెటైర్ పేలింది. ఈ దఫా ఆయన్ను జోకర్గా మార్చేసింది.
బండ్ల ఈజ్ బ్యాక్…
బండ్ల గణేష్ ప్రసిద్ధ సినీ నటుడు అనే సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల ముందు వరకు రాజకీయాల్లో బాగా యాక్టివ్ గా ఉన్న విషయం తెలిసిందే. కానీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిన తర్వాత ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. అప్పటినుండి సినిమాల్లో బిజీ అయిపోయారు. అయినప్పటికీ తాజాగా ఆయన్ను మళ్లీ రాజకీయాల్లోకి లాగారు.
ఇప్పుడెందుకు బండ్ల..
తెలంగాణలో జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బండ్ల పేరు తీశారు. ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బండ్ల గణేష్.. ఇప్పుడు బండి సంజయ్ కామెడీ షో చేస్తున్నారని కవిత ఎద్దేవా చేశారు. హైదరాబాద్ పేరు మారిస్తే ఏమొస్తుంది? అని ప్రశ్నించారు. అయితే కవిత వ్యాఖ్యల పై ట్విట్టర్ వేదికగా బండ్ల స్పందించారు. తన ట్విట్టర్ లో బండ్ల గణేశ్ ” నేను జోకర్ ను కాదు. ఫైటర్ని.. కానీ నేను ఇప్పుడు రాజకీయాల్లో లేను. నన్ను అందులోకి లాగొద్దు” అని ట్వీట్ చేశారు. దాంతో ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.
ముగిసిన గ్రేటర్ ప్రచారం
సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ ఎన్నికలకు ఏకంగా కేంద్రమంత్రులు, సీఎంలు, మాజీలనే బీజేపీ పార్టీ రంగంలోకి దించింది. బీజేపీని ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్ పార్టీ కూడా అన్ని పన్నాగాలు చేస్తోంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం పీక్కు చేరుకుంది. డిసెంబర్ 1వ తేదీన పోలింగ్ జరగనుండగా… అన్ని పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి.