(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: అమరావతి రాజధాని విషయంలో సీపీఐది మొదటి నుంచి ఒకటే నిర్ణయమని, ఈ విషయంలో మార్పు ఉండదని సీపీఐ సీనియర్ నేత డి రాజా స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన విజయవాడ వచ్చిన సందర్బంగా రాష్ట్ర పార్టీ కార్యదర్శి రామకృష్ణ, అమరావతి జేఏసీ నేతలు కలిశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాజధాని విషయంలో ఏపీ సీఎంకు ఎవరు సలహాలు ఇస్తున్నారో గాని, వారు తప్పుతోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. మూడు రాజధానులకు తమ పార్టీ వ్యతిరేకమనీ, అవసరమైతే ఈ విషయంలో రైతులతో కలిసి పోరాడుతామని స్పష్టం చేశారు. రాజధాని ఉద్యమాన్ని జాతీయ స్థాయిలోనూ తీసుకొని వస్తామన్నారు. ఉద్యమకారులపై తప్పుడు కేసులు పెట్టి వేధించడాన్ని రాజా తప్పుపట్టారు.