చంద్రబాబు ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. అదే ఉత్సాహంతో వచ్చే ఎన్నికల్లోనూ కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వస్తుంది.. అందుకే ఎన్డీయేలో చేరిపోవాలని ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిసి వచ్చారు. అమిత్ షాను కలిసి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు ఏం మాట్లాడడం లేదు. అసలు అమిత్ షా చంద్రబాబు ముందు ఏం డిమాండ్లు పెట్టారు ? అన్నది బయటకు రావడం లేదు. అదే చంద్రబాబు మాట అమిత్ షా దగ్గర చెల్లుబాటు అయ్యి ఉంటే చంద్రబాబు ఈ పాటికే ప్రచారాన్ని ఊదరగొట్టేసేవారు. అయితే అక్కడ డిమాండ్లు చూస్తే బాబు గొంతులో పచ్చి వెలక్కాయ పడిన చందంగా ఉందని ఇన్సైడ్ టాక్ ?
ఇప్పటికే బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న జనసేన ఇటు టీడీపీతో కూడా కలిసి ఎన్నికలకు వెళుతున్నట్టు చెప్పేసింది. ఈ కూటమిలోకి బీజేపీని కూడా చేర్చాలన్నది పవన్ ఆశ, ఆలోచన. ఇటు జనసేన ఇప్పటికే 25- 30 అసెంబ్లీ, 3 – 5 లోక్సభ సీట్లు అడుగుతున్న విషయం తెలిసిందే. పైగా కొన్ని నియోజకవర్గాల కోసం అటు టీడీపీ, ఇటు జనసేన రెండు పార్టీలు గట్టిగా పట్టుబడుతున్నాయి. ఈ టైంలో అమిత్ షా ఇచ్చిన లిస్టులో కొన్ని నియోజకవర్గాల పేర్లు చూసి చంద్రబాబుకు చలీ, జ్వరం వచ్చేలా ఉందన్న గుసగుసలు టీడీపీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి.
ఏపీ బీజేపీ నేతలు చెపుతున్న దాని ప్రకారం 26 అసెంబ్లీ, 7 పార్లమెంటు సీట్లు ఇవ్వాలని ఆయా నియోజకవర్గాల పేర్లతో సహా అమిత్ షా చంద్రబాబు ఎదుట ప్రతిపాదనలు చేసినట్టు సమాచారం. అంతకు మించి తక్కువ అయితే తమకు పొత్తు అవసరం లేదని కూడా అమిత్ షా బాబు ఎదుట కుండబద్దలు కొట్టేశారంటున్నారు. చంద్రబాబుకు షా ఇచ్చిన లిస్టులో రాయలసీమలో ధర్మవరం, శ్రీకాళహస్తి ఉన్నాయట.
అలాగే సీమలోనే ఆళ్లగడ్డ, ప్రొద్దుటూరు, మదనపల్లె కోస్తాలో రాజమండ్రి రూరల్, విజయవాడ సెంట్రల్, గుంటూరు వెస్ట్, ఏలూరు, విశాఖ నార్త్ సీట్లు ఉన్నాయంటున్నారు. ఈ లిస్టు నుంచి బీజేపీ మహా అయితే ఓ 20 సీట్లు మాత్రమే తగ్గించుకోవచ్చు.. ఎట్టి పరిస్థితుల్లోనూ 20 సీట్లకు మించి బీజేపీ తగ్గదని అంటున్నారు. అలాగే పార్లమెంటు సీట్లలో 5 సీట్లు కావాలన్నది మెయిన్ కండీషన్ అట. ఈ లిస్టులో ఏలూరు, విజయవాడ, రాజమండ్రి, హిందూపురం, చిత్తూరు, అరకు తదితర స్థానాలు ఉన్నాయట.
ట్విస్ట్ ఏంటంటే ఇప్పటికే జనసేన, టీడీపీ మధ్య గొడవలు నడుస్తోన్న కొన్ని సీట్లను బీజేపీ కూడా ఆశిస్తోంది. ఓవరాల్గా జనసేనకు + బీజేపీకి కలిపి 45 – 50 అసెంబ్లీ, 7- 10 పార్లమెంటు సీట్లు పోతే చాలా మంది టీడీపీ నేతలు త్యాగాలు చేయాలి. అది అంతిమంగా పార్టీలో పెద్ద సంక్షోభం, తిరుగుబాటుకు కారణమవ్వవచ్చు. ఈ డైలమాలోనే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వచ్చాక సైలెంట్ అయిపోయారని టాక్ ?