Kollywood: కోలీవుడ్ Kollywood సినిమా యూనిట్ మధ్యలో అభిప్రాయబేధాలు రావడం జరుగుతూ ఉంటుంది. భారతీయుడు2 సినిమా ఉదంతమే ఇందుకు నిదర్శనం. ఇప్పుడు తమిళంలోనే మరో సినిమాకు దాదాపు ఇటువంటి సమస్యే ఎదురైంది. దీంతో దర్శకుడు సినిమా నిర్మాతపై కోర్టులో కేసు వేశాడు. తమిళ హీరో శింబు-హన్సిక జంటగా ‘మహా’ సినిమా తెరకెక్కుతోంది. సినిమాకు దర్శకుడు యు.ఆర్.జమీల్. హన్సికకు ఇది 50వ సినిమా. ఒక పైలెట్, పైలెట్ అటెండెంట్ మధ్య కథ. వారికి పుట్టిన బిడ్డ చనిపోతే.. హీరో ఎలా ఆ విషయాన్ని తెలుసుకున్నాడు అనేది కథ. ఇప్పుడీ సినిమాను తనకు తెలీకుండా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారనేది దర్శకుడి ఆరోపణ.
అసలే కరోనా సమస్యలతో సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయో తెలీని పరిస్థితి. ఓటీటీలు మంచి ఆఫర్లు ఇస్తూ సినిమాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు నిర్మాతలు అటువైపు ఆలోచిస్తున్నారు. ఈక్రమంలో మహా సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు నిర్మాత ప్రయత్నిస్తున్నారని దర్శకుడు కోర్టుకు వెళ్లాడు. తనకు తెలీకుండానే బ్యాలెన్స్ సినిమా షూటింగ్ తన అసిస్టెంట్ దర్శకుడితో పూర్తి చేయించారని కూడా ఆరోపించాడు. సినిమా కథ మార్చారని, ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోరింగ్ విషయంలో కూడా తనకు ప్రమేయం లేకుండా చేశారని ఆరోపిస్తున్నాడు. ఇప్పుడు ఓటీటీలో తనకు తెలీకుండా రిలీజ్ చేస్తున్నారని.. ఆ విడుదలను అడ్డుకోవాలని కోరుతున్నాడు.
సినిమాకు పారితోషికం కింద 24 లక్షలు ఇవ్వాల్సి ఉండగా.. 8.15 లక్షలు మాత్రమే ఇచ్చారని.. మిగిలిన మొత్తంతోపాటు తన ప్రమేయం లేకుండా చేసినందుకు అదనంగా మరో 10లక్షలు పరిహారం ఇప్పించాలంటూ కోర్టులో వేసిన పిటిషన్ లో పేర్కొన్నాడు. దీంతో ఈ పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై మే 19లోపు నిర్మాతలు పిటిషన్ దాఖలు చేయాలని నిర్మాత వి.మతియలగన్, అసిస్టెంట్ డైరక్టర్ అన్జు విజయ్, అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ జాన్ అబ్రహంకు న్యాయమూర్తి కృష్ణన్ రామస్వామి ఆదేశాలు జారీ చేశారు. దీంతో భారతీయుడు2 తర్వాత తమిళంలో కోర్టు వరకూ వెళ్లిన సినిమాగా ‘మహా’ నిలిచింది. ప్రస్తతం కోలీవుడ్ లో ఈ అంశం సంచలనం రేపుతోంది.