భూ వివాదం నేపథ్యంలో గుంటూరు జిల్లా బాపట్ల టీడీపీ ఇన్ చార్జి నరేంద్ర వర్మ పై పోలీసు కేసు నమోదయ్యింది.ఆయన మాజీ కారు డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.
ఇదే వివాదానికి సంబంధించి వర్మ మాజీ కారు డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. ఆయన మాజీ కారు డ్రైవర్ వీరేష్ తాజాగా నిద్రమాత్రలు మింగి చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఓ స్థల వివాదం నేపథ్యంలో టీడీపీ నేత నరేంద్ర వర్మ అనుచరులు బెదిరించారని అతడు మనస్థాపం చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు ప్రచారం జరుగుతోంది.
వీరేష్ గతంలో టీడీపీ బాపట్ల ఇన్ చార్జి నరేంద్ర వర్మ దగ్గర కారు డ్రైవర్ గా పనిచేసేవాడు. గతంలో నాలుగు సెంట్ల స్థలాన్ని వీరేష్ పేరుతో నరేంద్రవర్మ రాసినట్టు తెలిసింది. నమ్మకంగా పనిచేయడంతో అతడి పేరుమీదనే ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేయించాడని సమాచారం.
అయితే ఇప్పుడు కారు డ్రైవర్ గా మానేయడంతో వీరిద్దరి మధ్య వివాదం మొదలైనట్టు ప్రచారం జరుగుతోంది. తిరిగి ఆ స్థలాన్ని తన పేరుమీద రాయాలంటూ నరేంద్ర వర్మ అనుచరుల బెదిరింపులు దిగినట్టుగా సమాచారం.
దీంతో బాధితుడు వీరేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు నరేంద్రవర్మతోపాటు ఆయన ముగ్గురు అనుచరులపై కేసులు నమోదు చేశారు. ఈ విషయంపై పోలీసులు అధికారికంగా స్పందించాల్సి ఉంది. దర్యాప్తు చేస్తున్నారు.ఏదేమైనా ఏమిటో టిడిపి నేతలు వరుసగా కేసులలో బుక్కయిపోతున్నారు.