AP High Court: ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికలు ముగిసే వరకూ వాలంటీర్ల రాజీనామాలు ఆమోదించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ బీసీ యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే.
నిన్నటి విచారణ సందర్భంగా వాలంటీర్లు ఎంత మంది రాజీనామా చేశారు అనే వివరాలను సమర్పించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఇవేళ ప్రభుత్వ న్యాయవాది వివరాలు అందజేశారు. ఇప్పటి వరకూ 62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారని న్యాయస్థానానికి న్యాయవాది తెలిపారు. 900 మంది పై చర్యలు తీసుకున్నామని కోర్టుకు ఈసీ న్యాయవాది తెలిపారు. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచామని ఈసీ న్యాయవాది వెల్లడించారు.
వాలంటీర్ల రాజీనామాలు ఆమోదిస్తే వారు వైసీపీకి అనుకూలంగా పని చేస్తారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఆర్టికల్ 324 ప్రకారం ఈసీకి విస్తృత అధికారాలు ఉన్నాయని పిటిషనర్ న్యాయవాది పేర్కొన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపేందుకు అధికారాలను వినియోగించవచ్చని న్యాయవాది తెలిపారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.
YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక