ఇటివల ప్రధానమంత్రి మోదీ మూడు నెలలపాటు గ్యాస్ సిలండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. అయితే.. ఈ అవకాశం కేవలం ఉజ్వల స్కీమ్ లబ్దిదారులకు మాత్రమే వర్తిస్తుంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న పేదల కోసం ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారు. పేదల కోసం ప్రధాని ఈ పథకాన్ని 2016 మే1న ప్రారంభించారు. ఉజ్వల స్కీమ్ లో చేరడం సులువే. ఇందుకు సంబంధించిన వివరాలు pmujjwalayojana.com వెబ్ సైట్ లో లభ్యమవుతాయి. ఈ విధానంలో బీపీఎల్ కుటుంబంలోని మహిళలు గ్యాస్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకునే వీలు ఉంది.
ఉజ్వల్ స్కీమ్ లో చేరేందుకు ముందుగా ఒక అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ను మీకు సమీపంలోని ఎల్ పీజీ డిస్ట్రిబ్యూటర్ కు ఇవ్వాలి. వీటితో పాటు మీ ఆధార్ కార్డ్ నెంబర్, జన్ ధన్ అకౌంట్ ఖాతా నెంబర్, అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. వీటన్నింటినీ పరిశీలించిన అనంతరం గ్యాస్ కంపెనీలు మీకు సిలిండర్ ఇచ్చేందుకు అనుమతులు ఇస్తాయి.
గ్యాస్ సిలిండర్ పొందేందుకు రూ.3,200 అవుతుంది. ఈ మొత్తంలో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూ.1600 ఉంటుంది. మిగిలిన రూ.1600 ఆయిల్ కంపెనీలు భరిస్తాయి. వినియోగదారులు రూ.1600 మార్కెటింగ్ సంస్థలకు ఈఎంఐ రూపంలో చెల్లించొచ్చు. ఈఎంఐ ప్లాన్ ఎంచుకుంటే గ్యాస్ సబ్సిడీ నుంచి ఆయిల్ కంపెనీలు డబ్బులు కట్ చేసుకుంటాయి.