Babu Mohan: తెలుగు రాష్ట్రాల్లో ప్రజాశాంతి పార్టీ అధినేత, ఒక నాటి ప్రముఖ సువార్తకుడు కేఏ పాల్ గురించి, ప్రముఖ సినీ హాస్య నటుడు బాబూ మోహన్ గురించి తెలియని వారు ఉండరు. వారి గురించి ప్రత్యేకంగా పరిచయం కూడా అవసరం లేదు. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో సందడి చేస్తూ హస్యాన్ని పండిస్తూ వస్తున్నారు. మీడియా సమావేశాల్లో కేఏ పాల్ చెప్పే మాటలు గానీ ప్రజలకు ఇచ్చే హామీలు ఆశ్చర్యంగానూ, హాస్యాస్పదంగానూ ఉంటుంటాయి.
ఎన్నికల్లో కేఏ పాల్ పోటీ చేయడంతో పాటు తన పార్టీ ప్రజాశాంతి తరపున అభ్యర్ధులను బరిలో దింపుతూ ఉన్నారు కానీ ఎక్కడా డిపాజిట్ లు దక్కించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. రాజకీయ నేతగా ఎదిగిన ప్రముఖ సినీ హస్య నటుడు బాబూమోహన్ ఇవేళ కేఏ పాల్ నేతృత్వంలోని ప్రజాశాంతి పార్టీలో చేరారు. కేఏ పాల్ సమక్షంలో సోమవారం ప్రజాశాంతి పార్టీ కండువా కప్పుకున్నారు బాబూమోహన్.
బాబూ మోహన్ ప్రజాశాంతి పార్టీలో ఎందుకు చేరారు అనే విషయాన్ని ఒక సారి పరిశీలిస్తే..ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన బాబూమోహన్ కు ఒక్క సారి అయినా ఎంపీ గా పోటీ చేసి గెలవాలన్న కోరిక ఉందట. ఇదే విషయాన్ని ఆయన ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన సమయంలో వెల్లడించారు. పార్టీలో గ్రూపుల కారణంగా తనపై విమర్శలు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రానున్న లోక్ సభ ఎన్నికల్లో వరంగల్ ఎంపీ టికెట్ ను ఆశించాననీ, అది ఇచ్చే పరిస్థితి లేదని బాబూమోహన్ అన్నారు. ఈ నేపథ్యంలోనే బాబూ మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. లోక్ సభ ఎన్నికల్లో వరంగల్ నుండి బరిలో నిలవనున్నట్లు ప్రకటించారు. వరంగల్ లో ఇవేళ నిర్వహించిన కార్యక్రమంలో త్వరలోనే ప్రచారం ప్రారంభిస్తామని, ఖచ్చితంగా విజయం సాధిస్తామని అభిప్రాయపడ్డారు.
సినీ హాస్య నటుడుగా మంచి గుర్తింపు పొందిన బాబూమోహన్.. తొలి నాళ్లలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు మద్దతు పలికారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. 1998 ఉప ఎన్నికల్లో ఆంధోల్ ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 1999 లో జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ విజయం సాధించారు. చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 2004,2009 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ అభ్యర్ధి దామోదర రాజనర్శింహ చేతిలో పరాజయం పాలైయ్యారు. 2014 ఎన్నికలకు ముందు టీడీపీని వీడి టీఆర్ఎస్ (బీఆర్ఎస్) లో చేరారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో దామోదర రాజనర్శింహ పై విజయం సాధించారు.
2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. బీజేపీ తరపున 2018 ఎన్నికల్లో పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. 2023 ఎన్నికలకు ముందు బాబూమోహన్ పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చివరకు ఆయనకే ఆంధోల్ నుండి బీజేపీ టికెట్ ఇచ్చింది. అయితే ఆ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ నుండి పోటీ చేసిన దామోదర రాజనర్సింహ గెలుపొందారు. బాబూమోహన్ మరో సారి మూడో స్థానానికే పరిమితం అయ్యారు.
నెల రోజుల క్రితం బీజేపీని వీడిన బాబూమోహన్ ఇవేళ కేఏ పాల్ పార్టీలో చేరారు. ఎన్నికల్లో విజయావకాశాలు ఎలా ఉన్నా వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని ప్రజలకు మాత్రం ఈ ఇద్దరు హస్యనటుల ప్రచారం నవ్వులు పూయించడం ఖాయంగా కనబడుతుంది.
Supreme Court: ఎంపీ, ఎమ్మెల్యేల అవినీతి కేసులపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు