తెలంగాణ సీఎంతో టాలీవుడ్ పెద్దలు చేసిన చర్చలకు తనను పిలవలేదని నందమూరి బాలకృష్ణ ఫైరయిన సంగతి తెలిసిందే. “బీప్” సంగతి వదిలేస్తే… తనను ఎవరూ పిలవలేదని, తలసానితో కలిసి హైదరాబద్ భూములు పంచుకోవడానికి కలిశారేమో అని నిప్పులు కాస్త సీరియస్ గానే స్పందించారు. పిలవలేదనే బాదో, వెళ్లలేకపోయామనే ఆవేదనో తెలియదు కానీ… బాలయ్య కాస్త ఘాటుగానే స్పందించారు. దీనిపై కాస్త పెద్ద మనిషి హోదాలో నిర్మాత సి. కల్యాణ్ స్పందించారు.. కాస్త సద్దుమణుగుతుందిలే అని అంతా అనుకున్నారు! ఇంతలో నాగబాబు రూపంలో సమస్య పెద్దది అయిపోయింది!
సరే.. ఇదంతా జరిగిపోయిన సంఘటన అని కాసేపు పక్కన పెడితే…. ఇప్పుడు రాబోతుంది మరో సమస్య అని అంటున్నారు విశ్లేషకులు! తెలంగాణ సీఎంను కలిసే విషయంలో బాలయ్యను పిలవని పని, మరోసారి ఇండస్ట్రీ పెద్దలు చేయరేమో అనేది తాజా క్లారిటీ! దీంతో ఇకపై బాలయ్యను కలుపుకుపోయే విషయంలో సెకండ్ థాట్ ఉండకపోవచ్చు. ఈ క్రమంలో… ఏపీ సీఎం జగన్ ను కూడా చిరంజీవి & కో సంప్రదించినప్పుడు జగన్ నుంచి సానుకూల స్పందన వచ్చిందని వార్తలు వస్తున్నాయి. “మీరు ఎప్పుడంటే అప్పుడు రావొచ్చు.. ఇండస్ట్రీ, ప్రభుత్వం నుంచి ఏమి ఆశిస్తుంది అనేదానిపై పక్కా క్లారిటీతో రావడంతోపాటు.. విశాఖలో ఇండస్ట్రీ అభివృద్ధికి సంబందించి సూచనలతో కూడా రావాలి” అని సూచించినట్లు కథనాలు వచ్చాయి. ఇక్కడే ఇప్పుడు రాబోయే సమస్య!
రాజకీయాలు వేరు, సినిమాలు వేరు అంటూ చెబుతున్న బాలయ్య.. తాను కేసీఆర్ ను రాజకీయంగా విమర్శలు చేసి ఉండొచ్చు తప్ప, వ్యక్తిగా తాను కేసీఆర్ ని ఎంతో గౌరవిస్తానని, ఆయన కూడా తనను పుత్రవాత్సల్యంతో చూస్తారు అని బాలయ్య చెబుతున్నారు. ఈ క్రమంలో జగన్ దగ్గరకు వెళ్లేటప్పుడు చిరు & కో బాలయ్యను కూడా పిలుస్తారా? పిలిస్తే బాలయ్య వెళ్తారా? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న! పిలవకపోతే… సినిమాలు వేరు రాజకీయాలు వేరు.. జగన్ ఒకప్పుడు నా అభిమాన సంఘానికి ప్రెసిడేంట్… పిలిస్తే ఎందుకు రాను అంటారేమో అని ఒక ఆలోచన కాగా… ఏమి వెటకారంగా ఉందా? కేసీఆర్ అంటే తన పార్టీలో గతంలో మంత్రిగా పనిచేశారు, పైగా నాన్నగారి అభిమాని అందుకు వస్తాను అన్నాను కానీ.. జగన్ దగ్గరకు ఎందుకు వస్తాను అని అంటారా? ఏమో వేచి చూడాలి మరి! కాని… “జగన్ దగ్గరకు బాలయ్య” అనే టాపిక్ మాత్రం ప్రస్తుతం అటు సినీ, ఇటు రాజకీయరంగాల్లో హాట్ టాపిక్ అనే చెప్పాలి!!