సాధారణంగా క్రికెట్ టీమ్ లో ఆడే ఆటగాళ్లకు ప్రతిసారి శరీర ఫిట్ నెస్ కి సంబంధించిన పరీక్షలు చేపడుతుంటారు. ఇప్పటికే ఆటగాళ్ల ఫిట్ నెస్ స్థాయిని పరీక్షించడానికి అమలులో ఉన్న యో_యో పరీక్షలను నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ పరీక్షతో పాటు మరో కొత్త తరహా పరీక్షను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.ఈ కొత్త తరహా పరీక్ష ప్రకారం పరుగులో వేగాన్ని బట్టి ఆటగాళ్ల శరీర ఫిట్ నెస్ సామర్థ్యాన్ని పరీక్షించనుంది.
ఈ పరీక్షలో భాగంగా పేస్ బౌలర్లు అయితే రెండు కిలోమీటర్ల పరుగును ఎనిమిది నిమిషాల 15 సెకండ్ ల సమయంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా స్పిన్నర్లు, వికెట్ కీపర్, బ్యాట్ మెన్ కు ఈ పరీక్షలో మరో 15 సెకండ్ల అదనపు సమయాన్ని కేటాయిస్తూ మొత్తం రెండు కిలోమీటర్ల దూరాన్ని ఎనిమిది నిమిషాల 30 సెకన్ల గరిష్ట సమయాన్ని నిర్దేశించారు.బీసీసీఐ నిర్ణయించిన ఈ సమయానికి పరుగుపందెం పూర్తిచేసే దాన్నిబట్టి క్రికెటర్ల శరీర ఫిట్ నెస్ ను అంచనా వేస్తారు.
ఈ పరీక్షను కాంట్రాక్ట్ ప్లేయర్స్ తో పాటు, జట్టులోకి వచ్చే అవకాశం ఉన్న ప్లేయర్ అందరికీ ఈ పరీక్ష వర్తిస్తుందని బీసీసీఐ తెలిపింది. ప్రతి సంవత్సరం ఈ పరీక్షను మూడు సార్లు నిర్వహిస్తారు. అయితే ముందుగా ఇంగ్లాండ్ తో జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్ లలో పాల్గొనే ఆటగాళ్లు ఈ పరీక్షలో పాల్గొననున్నారు. అయితే అత్యున్నత స్థాయిలో ఆట ఆడే అథ్లెట్లు సాధారణంగా 6 నిమిషాల్లోనే 2 కిలోమీటర్లు పూర్తి చేస్తుంటారు కాబట్టి బీసీసీఐ ప్రకటించిన ఈ కొత్త పరీక్ష వల్ల క్రికెటర్లు పెద్దగా ఇబ్బంది పడకపోవచ్చు.