విశాఖపట్నం జిల్లాలోని భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పుడు కూటమిలో పెద్ద హాట్ సీటుగా మారిపోయింది. ప్రస్తుతం ఇక్కడ నుంచి వైసీపీ తరఫున మాజీమంత్రి అవంతి శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోను వైసీపీ అభ్యర్థిగా ఆయనే పోటీ చేయనున్నారు. 2009 ఎన్నికల్లోను అవంతి శ్రీనివాసరావు ఇక్కడ నుంచి ప్రజారాజ్యం తరఫున విజయం సాధించారు. అయితే 2014 ఎన్నికలలో టీడీపి నుంచి గంటా శ్రీనివాసరావు 37వేల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించి టీడీపి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. విచిత్రం ఏంటంటే ఆ తర్వాత అవంతి కూడా వైసిపి నుంచి గెలిచి మంత్రి అయ్యారు.
అయితే ఇప్పుడు భీమిలి సీటు ఇట్టు ప్రతిపక్ష కుటమిలో పెద్ద హాట్ సీటుగా మారింది. ప్రతి ఎన్నికకు నియోజకవర్గం మారే అలవాటు ఉన్న గంటా శ్రీనివాసరావు.. ఈసారి భీమిలి నుంచి పోటీ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. ఒకానొక దశలో భీమిలి సీటును పొత్తులో భాగంగా జనసేన తీసుకుంటుందని కూడా ప్రచారం జరిగింది. గతంలో ఇక్కడ ప్రజారాజ్యం విజయం సాధించడంతో.. జనసేన నుంచి పోటీ చేసేందుకు చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. అయితే ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేనకు కేటాయించిన నాలుగు సీట్లలో భీమిలి లేదు.
ఇక గంటా విషయానికి వస్తే ఆయనకు భీమిలి సీటు ఇచ్చేందుకు టీడీపి అధిష్టానం ఎంత మాత్రం సిద్ధంగా లేదు. విజయనగరం జిల్లాలో చీపురుపల్లికి బలవంతంగా పంపిస్తుంది. దీంతో ఇప్పుడు భీమిలి నుంచి టీడీపి తరఫున ఎవరు పోటీ చేస్తారని అంశంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నుంచి పోటీ చేయాలని కర్రోతు బంగారు రాజు అన్నీ ఏర్పాట్లు చేసుకున్నారు. పొత్తులో భాగంగా ఆ సీటు జనసేనకు కేటాయించడంతో.. అక్కడ నుంచి లోకం మాధవి పోటీకి దిగారు. దీంతో బంగార్రాజు ఇప్పుడు భీమిలి సీటు అడుగుతున్నారు.
ప్రస్తుతం భీమిలి టీడీపి ఇన్చార్జిగా కోరాడ రాజబాబు ఉన్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు తాను ఎంతో సేవ చేశానని.. టిక్కెట్ తనకే రావాలని ఆయన పట్టుబడుతున్నారు. మరోవైపు అనకాపల్లి ఎంపీ సీటు కోసం విశ్వ ప్రయత్నాలు చేసినా బైరా ఫౌండేషన్ ఎండి బైరా దిలీప్ చక్రవర్తి కూడా అనకాపల్లి పార్లమెంటు సీటు బీజేపికి ఇవ్వడంతో తాను భీమిలి వెళ్తానని తనకు అక్కడ ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ఏది ఏమైనా భీమిలి సీటు ఇప్పుడు కూటమిలో చాలా హాట్ సీటుగా మారిపోయిందని చెప్పాలి. మరి భీమిలి సీటును దక్కించుకునే ఆ లక్కీ పర్సన్ ఎవరో చూడాలి.