తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీమంత్రి గంటా శ్రీనివాసరావుకు రాజకీయంగా తొలిసారి ఇబ్బందులు తప్పడం లేదు. గత 25 సంవత్సరాలుగా గంట ఏ పార్టీలో ఉన్న ఆయన ఆడింది ఆట.. పాడింది పాటగా.. కొనసాగుతూ వచ్చింది. తెలుగుదేశంతోనే గంటా రాజకీయం మొదలైంది. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన గంటా.. 1999లో అనకాపల్లి ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత అయ్యనపాత్రుడితో విభేదించి.. ఆయనకే ఏకుకుమేకు అయిపోయారు.
2004లో మంత్రి అయిపోవాలని కోరికతో చోడవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ప్రజారాజ్యంలోకి వెళ్లిన గంట అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజారాజ్యం, కాంగ్రెస్లో విలీనం కావడంతో అక్కడ మంత్రి అయ్యారు. 2014 ఎన్నికలకు ముందు తన ప్రజారాజ్యం టీంతో కలిసి టీడీపి కండువా కప్పుకుని భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తెలుగుదేశం ప్రభుత్వంలోనూ మంత్రిగా ఉన్నారు. మొత్తం ఏడు సంవత్సరాలు పాటు గంట కంటిన్యూగా మంత్రిగా కొనసాగారు. కట్ చేస్తే 2019 ఎన్నికల టైం లో మళ్ళీ గంటా భీమిలి నుంచి విశాఖ నార్త్ నియోజకవర్గానికి మారి ఇక్కడ కూడా గెలిచారు.
అయితే ఈసారి టిడిపిలో గంటా ప్పపులు ఉడకటం లేదు. నాలుగేళ్ల పాటు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఇంట్లో నుంచి బయటికి రాని గంటా.. తెలుగుదేశం, జనసేన పొత్తు కుదరడంతోనే బయటకు వచ్చారు. నాలుగేళ్ల జగన్ ప్రభుత్వం పై ఏనాడు గట్టిగా బలంగా గంటా శ్రీనివాసరావు విమర్శలు చేయలేదు. ఈ క్రమంలోనే గంటా జిత్తుల మారి రాజకీయాన్ని గమనించిన లోకేష్.. ఆయనకు క్రమక్రమంగా ప్రాధాన్యం తగ్గిస్తూ వచ్చారు. చివరకు ఆయన పోటీ చేసే నియోజకవర్గం మంత్రి బొత్సా సత్యనారాయణ ప్రాథినిత్యం వహిస్తున్న చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని చంద్రబాబు ఆదేశించారు.
అక్కడ వైసిపి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సీనియర్ మంత్రి బొత్సా బరిలో ఉండడంతో గంటా పోటీ చేసేందుకు ఇష్టపడలేదు. పైగా తాను ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెబుతూ వస్తున్నారు. విశాఖపట్నం కి 150 కిలోమీటర్ల దూరంలో ఉండే చీపురుపల్లిలో పోటీ చేసేందుకు గంటాకు ఏ మాత్రం ఇష్టం లేదు. పైగా గంటాను చాలా వ్యూహాత్మకంగా విశాఖ జిల్లా రాజకీయాల నుంచి తప్పిస్తున్న వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు నిలబడిన రెండు జాబితాలలోనూ గంటా పేరు ప్రకటించలేదు. మధ్యలో గంటా తన వియ్యంకుడు మాజీ మంత్రి నారాయణను వెంటబెట్టుకుని వెళ్లి మరీ చంద్రబాబును కలిసి.. తాను విశాఖ జిల్లా నుంచి పోటీ చేస్తానని రిక్వెస్ట్ చేశారు.
అయితే చంద్రబాబు మాత్రం గంటా సీటు విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ పై పోటీ చేయాలని స్పష్టంగా చెప్పడంతో గంటా అయిష్టంగానే చీపురుపల్లి నుంచి బొత్సపై పోటీ చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. కేవలం టీడీపి యువ నేత నారా లోకేష్ గంటాకు వ్యూహాత్మకంగా చెక్ పెట్టే క్రమంలో తెరవెనక పావులు కదిపి ఆయన విశాఖ జిల్లా రాజకీయాలనుంచి తప్పించి చీపురుపల్లికి పంపేసినట్టు తెలుస్తోంది.