ఏపీలో ఎన్నికల పోలింగ్ మొదటి దశలో లేదు. నాలుగో దశలో జరుగుతుంది. దీంతో పార్టీలకు కావలసినంత సమయం దక్కింది. ఈ నేపథ్యంలో ఇటు అధికార వైసిపితో పాటు.. కూటమిగా ఏర్పడ్డ తెలుగుదేశం, జనసేన, బీజేపి పార్టీలకు ఎన్నికలకు వెళ్లేందుకు కావలసినంత సమయం దొరికింది. ఎత్తులు పై ఎత్తులు వేసుకునేందుకు చాలా టైం ఉండడంతో.. ఇటు చంద్రబాబు.. అటు జగన్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పవన్ కూడా అదే బాటలో ముందుకు వెళుతున్నారు.
ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విషయంలో చంద్రబాబు మళ్లీ యూటర్న్ తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల విషయంలో సవరణలకు దిగుతున్నారని సమాచారం. ఇంకా నామినేషన్లు దాఖలు చేసేందుకే కావలసిన సమయం ఉండడంతో.. తెలుగుదేశం పార్టీ తరఫున ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులు జాబితాలలో మార్పులు.. చేర్పులు.. ఉంటాయని అంటున్నారు.
కేవలం టీడీపి ప్రకటించిన అభ్యర్థులు జాబితాలోనే కాదు.. జనసేన, బీజేపి పోటీ చేసే సీట్ల విషయంలో కూడా మార్పులు, చేర్పులు ఉంటాయని తెలుగుదేశం వర్గాలు చర్చించుకుంటున్నాయి.
తెలుగుదేశం అభ్యర్థులు జాబితాలో పలుచోట్ల ఇంకా నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. అసంతృప్తులు రోడ్డెక్కుతున్నారు. జాబితాలో ప్రకటించిన వ్యక్తులకు సహకరించేది లేదంటూ.. పార్టీ శ్రేణులు ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంకా చాలా సమయం ఉండడంతో చంద్రబాబు మార్పులు.. చేర్పులు చేసేందుకు మళ్ళీ కసరత్తులు చేస్తున్నారట. తెలుగుదేశం ఇప్పటికే తమ పార్టీ నుంచి పోటీ చేసే వందమందికి పైగా అభ్యర్థులను ప్రకటించేసింది.
జనసేన మొత్తం 21 నియోజకవర్గాలలో పోటీ చేస్తుండగా.. బీజేపి 10 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తుంది. టీడీపి ఇంకో 20 లోపు సీట్లకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థుల జాబితాలలో మార్పులు చేర్పులు ఉంటాయని తెలుస్తోంది. అలాగే జనసేన పోటీ చేస్తుంది అనుకున్న సీట్ల విషయంలో కూడా మార్పులు చేర్పులు ఉంటాయని.. ఇంకా బిజెపి ఎక్కడెక్కడ పోటీ చేస్తుందో క్లారిటీ లేదట.
ఇప్పుడు చాలా టైం ఉండడంతో అభ్యర్థులు ఎంపిక చేస్తోన్న చంద్రబాబు.. మళ్ళీ పునః సమీక్ష చేసి మరుస్తున్నారని తెలుస్తోంది. ఇక బిజెపి – జనసేన పార్టీల బలాన్ని దృష్టిలో పెట్టుకుని వారు ఏ ఏ నియోజకవర్గాల్లో పోటీ చేయాలి అన్నదానిపై మళ్లీ కసరత్తులు మొదలయ్యాయని అంటున్నారు. దీంతో ఎవరి సీటు ఉంటుందో..? ఎవరి సీటు ఊడుతుందో..? అన్న టెన్షన్ అయితే తెలుగుదేశం వర్గాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.