Telangana Election: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరం దగ్గర పడుతున్న వేళ బీజేపీ – జనసేన మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తొంది. పొత్తు అంశంపై ఇప్పటికే జనసేన – బీజేపీ మధ్య ఒక అవగాహన వచ్చిన సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ముందుగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ లు మంతనాలు జరిపారు. ఆ తర్వాత అమిత్ షాతో పవన్ కళ్యాణ్ సమావేశమై చర్చించారు. పొత్తుపై పయనంపై ఇరు పార్టీలు అవగాహనకు వచ్చేశాయి.
అయితే పొత్తులో భాగంగా జనసేన పార్టీ 20 సీట్లు డిమాండ్ చేస్తుండగా, బీజేపీ అధిష్టానం జనసేనకు 8 నుండి 10 సీట్లు ఇవ్వడానికి సిద్దమైనట్లుగా తెలుస్తొంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆంధ్రప్రాంత ఓటర్లు ఎక్కువగా ఉన్న కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, ఎల్బీ నగర్ వంటి స్థానాలను తమకు కేటాయించాలని జనసేన కోరుతోంది. అయితే కూకట్ పల్లి ని జనసేనకు కేటాయించేందుకు బీజేపీ నాయకత్వం అంగీకరించినట్లు సమాచారం. అలానే ఆంధ్రప్రదేశ్ సరిహద్దుగా ఉన్న ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో మిగితా స్థానాలను కేటాయించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తొంది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం కూకట్ పల్లి, వైరా, ఖమ్మం, అశ్వారావుపేట, కొత్తగూడెం, కోదాడ, నాగర్ కర్నూల్, తాండూరు స్థానాలతో పాటు మరో రెండు జనసేనకు కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రెండు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాలుగు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు లేక నాలుగు స్థానాలు ఇచ్చేందుకు బీజేపీ యోచన చేస్తుందని అంటున్నారు.
ఒకటి రెండు రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో బీజేపీ నేతలు సమావేశమైతే దీనిపై ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ మూడు విడతలుగా అభ్యర్ధుల జాబితాను విడుదల చేసింది. జనసేనకు కేటాయించే సీట్ల విషయం తేలితే ఫైనల్ జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. సీట్ల సర్దుబాటు పూర్తి అయిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సేవలను ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకోవాలని కమలనాధులు భావిస్తున్నారు. బీజేపీ అగ్రనేతలు పాల్గొనే బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.
Telangana Elections: తలసానికి సెంటిమెంట్ దెబ్బ పడుతుందా..! హాట్రిక్ సాధించి రికార్డు సృష్టిస్తారా..?