అమరావతి: లక్ష్మీపార్వతి తనను లైంగికంగా వేధిస్తోందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి వార్తల్లోకి ఎక్కిన కోటిని పార్టీలోకి చేర్చుకున్న బిజెపి విషయం తెలిసి నాలుకర్చుకోంది. తూచ్ బిజెపి నాయకత్వం అతనికి సభ్యత్వం ఖరారు చేయలేదంటూ వివరణ ఇచ్చుకోంది. రాష్ట్రంలో బిజెపిని బలోపేతం చేసేందుకు ముందు వెనుక ఆలోచించకుండా ఎవరు వస్తే వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానిస్తున్నారు.
నిన్న బిజెపి రాష్ట్ర కార్యాలయం గుంటూరులో మాజీ మంత్రి రావెల కిషోర్బాబు ఆధ్వర్యంలో వినుకొండ నియోజకవర్గం నుండి టిడిపి నాయకులు సుమారు 80మంది బిజెపిలో చేరారు. వీరికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీ కండువాలు కప్పారు.
చేరిన వారిలో లక్ష్మీపార్వతికి సహాయకుడుగా పని చేస్తున్న సమయంలో ఆమెను నమ్మించి ఆమె సెల్ ఫోన్ నుండి తన ఫోన్కు అసభ్య మెసేజ్లు పంపించుకొని ఆమెపైనే తప్పుడు ఫిర్యాదు చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న బి కోటేశ్వరరావు ఎలియాస్ కోటి ఉన్నాడు. చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి కోటి బిజెపిలో చేరాడంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు చలోక్తులతో విమర్శలు గుప్పిస్తూ కోటి బిజెపిలో చేరిన ఫోటోను వైరల్ చేశారు. ఆ పరిణామంతో ఖంగుతిన్న బిజెపి దీనిపై వివరణ ఇచ్చింది. స్థానిక నేతలకు సమాచారం ఇవ్వకుండా అతను బిజెపిలో చేరాడు, అతనికి సభ్యత్వం ఇవ్వలేదు, కోటి బిజెపి సభ్యుడు కాదంటూ వివరణ ఇచ్చింది.