Pawan Kalyan: రాయలసీమ బానిస సంకెళ్లలో ఉండిపోయిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. చిత్తూరు జిల్లా ఒక కుటుంబం చేతిలో బందీ అయ్యిందని అన్నారు. వ్యక్తిగతంగా పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డితో తనకు విభేదాలు లేవు కానీ సీమలో కొందరు నేతలు ఆధిపత్యం చెలాయిస్తున్నారని అన్నారు. మరో సారి వైసీపీ అధికారంలోకి వస్తే ఈ ప్రాంతంలో ఇంకేమి మిగలదని అన్నారు.
చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గురువారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ .. ఆరణి శ్రీనివాసులు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పటి నుండి తెలుసునని అన్నారు. రాయలసీమ ప్రాంతంలోని చాలా మంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిపోతున్నారని అన్నారు. భయం వదిలివేస్తేనే పరిస్థితులు మారుతాయని అన్నారు. వైసీపీ నేతలు తిరుపతిని అడ్డగోలుగా దోచుకుంటున్నారని విమర్శించారు. జగన్ గుంపు నుండి సీమను రక్షించుకోవాలని అన్నారు.
మంగళగిరిలో జనసేన శ్రేణులు ఉంటున్న అపార్ట్ మెంట్ లో పోలీసులు తనిఖీలు చేయడంపై పవన్ స్పందించారు. సెర్చ్ వారెంట్ లేకుండా పోలీసులు తమ ఆవరణలోకి వచ్చారన్నారు. రాజకీయాల్లో ఇదంతా సహజం అంటే కుదరదని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అందరూ గౌరవించాలన్నారు. పోలీసు అధికారులు ప్రస్తుత ప్రభుత్వానికి అనుకూలంగా ఇష్టానుసారం వ్యవహరిస్తామంటే కుదరదని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుంటే సంకీర్ణ ప్రభుత్వం వచ్చాక అలాంటి వారిని గుర్తు పెట్టుకుంటామని, వైసీపీకి కొమ్ము కాసే పోలీసు అధికారులు జాగ్రత్తగా ఉండాలని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
YS Jagan: చంద్రబాబును నమ్మడం అంటే కాటేసే పామును నమ్మడమే – జగన్