గుంటూరు, మార్చి 30: అవినీతి రహిత పాలన జనసేన-వామపక్షాల కూటమితోనే సాధ్యమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. గుంటూరు జిల్లాలో జనసేన, వామపక్ష అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్టంలో జనసేన, సిపిఐ, సిపిఎం, బిఎస్పి కూటమి అధికారంలోకి వస్తుందని రామకృష్ణ ధీమా వ్యక్తం చేశారు.
ఒకవేళ టిడిపి అధినేత, సిఎం చంద్రబాబుకు మరోసారి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చేస్తారనీ, అదే వైసిపి అధినేత జగన్ను గెలిపిస్తే ఇడుపులపాయకు రాజధాని తీసుకెళతారని రామకృష్ణ సంచలన విమర్శలు చేశారు.
రాష్టంలో టిడిపి, వైసిపి దొందూదొందేనని అన్నారు. మంగళగిరి అభ్యర్థి ముప్పాళ్ల నాగేశ్వరరావు, గుంటూరు లోక్ సభ అభ్యర్థి శ్రీనివాస్ యాదవ్కు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలకు రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.