West Bengal Politics: ఉప్పు నిప్పు మాదిరిగా ఉన్న కేంద్రం ,పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక ఐఏఎస్ అధికారి అడకత్తెరలో పోకచక్కలా నలిగిపోతున్నారు.పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అల్పాన్ బందోపాధ్యాయకు ఈ చిక్కులొచ్చిపడ్డాయి. కేంద్రమేమో ఆయనను ఢిల్లీకి రావాలని ఆదేశిస్తుంటే ముఖ్యమంత్రేమో ఆయన ఇక్కడే ఉండాలంటూ ఒత్తిడి తెస్తున్నారు గతవారం కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం ఆయనను వెంటనే వచ్చి కేంద్ర సర్వీసుల్లో చేరాల్సిందిగా ఆదేశించింది.మే 31వతేదీ లోపుగా ఇది జరగాలని కూడా హుకుం జారీ చేసింది. గా రోజుకల్లా ఆయన నార్త్ బ్లాక్ లో రిపోర్ట్ చేయాలని ,ఇందుకు అనుగుణంగా ఆయనను రిలీవ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఒక లేఖ ద్వారా ఆదేశించడం జరిగింది.
West Bengal Politics: సీఎం మమత రియాక్షన్ ఇదీ
అయితే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఖాతరు చేయలేదు.ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల కారణంగా సీఎస్ ను ఇప్పటికిప్పుడు రిలీవ్ చేయడం కుదరదని సీఎం తేల్చేశారు.ఆ మేరకు కేంద్రానికి ఆమె ఒక లేఖ కూడా రాశారు .ఇంతకు ముందే రాష్ట్రంలో ఆయన సర్వీసులను పొడిగించిన కారణంగా ఇప్పటికిప్పుడు ఆయన్ను పంపడం సాధ్యపడదని దీదీ స్పష్టం చేసింది.
ఇప్పుడు జరగబోయేదేమిటి!
ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతోందన్నది ఐఏఎస్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చనీయాంశంగా మారింది.కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించారన్న కారణంపై బందోపాధ్యాయ మీద ఢిల్లీ పెద్దలు క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశముందంటున్నారు.ఇదే జరిగితే ఆయన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (కాట్ ) తలుపులు తట్టే అవకాశం లేకపోలేదు.వాస్తవానికి రాష్ట్ర సర్వీసులో ఉన్న ఐఏఎస్ అధికారులపై చర్యలు తీసుకునే అధికారం కేంద్రానికి లేదన్న వాదన వినిపిస్తోంది.అందుకే కేంద్రం ఆయనను ఇరికించేందుకు తక్షణం ఢిల్లీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించి,ఆ ఆదేశాలను బందోపాధ్యాయ ధిక్కరించారన్న కారణం చూపి ఆయన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకునే స్కెచ్ వేసిందంటున్నారు. కానీ ఆ చర్యలు ఐఏఎస్ సర్వీస్ నిబంధనల ప్రకారం నిలిచే అవకాశం లేదని..బందోపాధ్యాయ ట్రిబ్యునల్ కి వెళ్లి తనను రాష్ట్ర ప్రభుత్వం రిలీవ్ చేయనందున తాను కేంద్ర సర్వీసులకు వెళ్లలేకపోయానని చెబితే ఆయన వాదనే నెగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.మరి ఏం జరుగుతుందో చూడాలి!