Farmers: కర్షకులు మళ్లీ కదం తొక్కనున్నారు. వారికి 12 ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతు తెలిపాయి.ఢిల్లీ శివార్లలో చేస్తున్న ఆందోళనలకు ఆరు నెలలు నిండటంతో ఈనెల 26వ తేదీని బ్లాక్ డేగా ప్రకటించిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్ కే ఎం)అదే రోజున దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని రైతులకు పిలుపు నిచ్చింది.
వివాదాస్పద సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు ఈ ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా జనవరి ఇరవై ఆరో తేదీన రిపబ్లిక్డే నాడు రైతులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారడం,వీరి ఆందోళనలలో కొందరు సంఘవిద్రోహ శక్తులు చేరడం వంటి పరిణామాలు చోటు చేసుకోవటం విదితమే.ఆ తరువాత ఇంటర్నెట్ వినియోగంపై కేంద్రం ఆంక్షలు విధించటం, పలువురు రైతు నేతలను గృహనిర్బంధం చేయడం, వారి ఆందోళనలపై ఉక్కుపాదం మోపడం కూడా జరిగింది.వీటన్నింటినీ నిరసిస్తూ రైతులు మరోసారి దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధమైపోయారు.
ఏయే పార్టీలు మద్దతిచ్చాయ౦టే!
సంయుక్త కిసాన్ మోర్చా నాయకుల విజ్ఞప్తి మేరకు పన్నెండు ప్రతిపక్ష పార్టీలు ఇరవై ఆరో తేదీనాటి ఆందోళనకు మద్దతు ఇస్తూ లేఖ విడుదల చేశారు. కాంగ్రెస్ ,సిపిఐ ,సిపిఎం, ఎన్సీపీ,జనతాదళ్ సెక్యులర్,తృణమూల్ కాంగ్రెస్,నేషనల్ కాన్ఫరెన్స్,డిఎంకె,శివసేన, సమాజ్వాదీ పార్టీ,జార్ఖండ్ ముక్తి మోర్చా , రాష్ట్రీయ జనతాదళ్ పార్టీల అగ్ర నాయకులు ఈ లేఖపై సంతకాలు చేశారు.
Farmers: అసలు ఆందోళన ఎందుకంటే !
గత ఏడాది సెప్టెంబర్లో పార్లమెంటు ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.ఇవి రైతులను నష్టపరిచేవిగాను ,కార్పోరేట్ సంస్థల కు లబ్ధి చేకూర్చేవిగాను ఉన్నాయంటూ వారు ఆందోళన చేపట్టారు.వేలాది మంది రైతులు ఢిల్లీలో పగలు రాత్రి చలి ఎండ వాన తేడాలేకుండా ఆరు నెలలుగా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు.అయినా కేంద్రప్రభుత్వం వీరిని పట్టించుకోకపోవడంతో మరోసారి వారిలో ఆగ్రహజ్వాల ప్రజ్వరిల్లింది.
ఆ రోజే బ్లాక్ డే ఎందుకు?
కాగా ఈనెల ఇరవై ఆరో తేదీని సంయుక్త కిసాన్ మోర్చా బ్లాక్ డేగా ప్రకటించడం వెనుక బలమైన కారణం ఉంది.రెండోసారి నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది మే ఇరవై ఆరోవ తేదీనే కావడంతో ఆ రోజును మోర్చా ఎంచుకున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.రైతులకు తోడు పన్నెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కూడా కలిసి ఆందోళనను నిర్వహిస్తుండటంతో ఈసారి ఇది మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలు ఉన్నాయి.