ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో మూడు రాజధానుల వ్యవహారం పీక్స్ లో కొనసాగుతోంది! ఏపీలో రాజకీయంగా మాట్లాడుకునేవారిలో ఏ ఇద్దరు కలిసినా వారి మధ్య ఇదే హాట్ టాపిక్ కన్నా అతిశయోక్తి కాదేమో! ఈ క్రమంలో అటు తిరిగి ఇటు తిరిగి ఆఖరికి గవర్నర్ వద్దకు చేరిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో ఇప్పటికే రెండు సార్లు ఆమోదం పొందడం… మండలిలో ఆమోదించడం కానీ – తిరస్కరించడం కానీ జరగకపోవడం తెలిసిన సంగతి! ఈ క్రమంలో గవర్నర్ కి కొన్ని లేఖలు చేరాయి… వాటిలో హాట్ టాపిక్ గా మారింది బీజేపీ అధ్యక్షుడి హోదాలో కన్నా లక్ష్మీనారాయణ రాసిన లేఖ!
అవును.. ఏపీ బీజేపీలోని అందరి పెద్ద సభ్యులనూ సంప్రదించకుండా.. తన వ్యక్తిగత అభిప్రాయాన్ని పార్టీ అభిప్రాయంగా చెబుతూ… కన్నా లక్ష్మీనారాయణ.. చంద్రబాబు నుంచి లేఖ వెళ్లిన కొద్దిసేపటికే పంపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పార్టీ పరోక్ష అభిప్రాయంగా కేంద్రంలోని పెద్దలు.. “రాజధాని అనేది పూర్తిగా ఆ రాష్ట్రప్రభుత్వ పరిధిలోని అంశం” అని క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా… అది కాదు అసలు అభిప్రాయం ఇది అన్నట్లుగా కన్నా లేఖ రాశారు. పోనీ అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అనుకునేలోపు లంకా దినకర్ తన ట్వీట్ ద్వారా.. కన్నాను ఇరికించేశారు!
“ఏపీ బీజేపీ – కేంద్ర బీజేపీ అని రెండు పార్టీలు లేవు.. భారతదేశం మొత్తం ఉన్నది ఒక్కటే భారతీయ జనతాపార్టీ. ఆ పార్టీ అభిప్రాయమే కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు” అనేది లంకా దినకర్ ట్వీట్ సారాంశం! దీంతో హస్తినలో జాతీయ పార్టీ పెద్దలను సంప్రదించకుండా.. కనీసం స్థానికంగా రాష్ట్ర శాఖలోని సభ్యులను సంప్రదించకుండా లేఖ రాయడం ఒకతప్పు అయితే… అదే ఫైనల్ గా పార్టీ అభిప్రాయం అన్నట్లుగా చెప్పడం మరో తప్పు అనేది ఇప్పుడు బీజేపీ కేంద్ర పెద్దలు చెబుతున్న మాట అంట! దీంతో… కన్నా తనకు తాను ఇరుక్కోవడం ఒకెత్తు అయితే… దినకర్ మరింత బలంగా ఇరికించేయడం మరోకెత్తు అనేది ఏపీ బీజేపీ క్యాడర్ లో వినిపిస్తోన్న మాట!!