రాష్ట్రంలో ప్రకంపనలు రేపిన డాక్టర్ సుధాకర్ ఎట్టికేలకు హైకోర్టు ఆదేశాల మేరకు విశాఖ మానసిక వైద్యశాల నుండి విడుదలయ్యారు.
ఇంటికి చేరుకున్న డాక్టర్ సుధాకర్ అసలు మొదటి నుండి ఏం జరిగిందో మీడియాకు వివరించటానికి సమాయత్తమవుతున్నారు. ఈ మీడియా సమావేశానికి జాతీయ మీడియాను కూడా ఆహ్వానించబోతున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇదో సంచలన మీడియా సమావేశం కాగలదని అందరూ భావిస్తున్నారు.కాగా ఆస్పత్రి నుండి సుధాకర్ డిశ్చార్జికి ముందు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆసుపత్రిలో అక్రమంగా నిర్బంధించిన తన కుమారుడిని హైకోర్టులో హాజరు పరిచేలా ఆదేశాలు జారీ చేయాలంటూ డాక్టర్ సుధాకర్ తల్లి కావేరీబాయి హైకోర్టులో వేసిన హెబియస్ కార్పస్ హౌస్ మోషన్ పిటిషన్ను విచారించిన హైకోర్టు ఆయనను డిశ్చార్జ్ చేయాలని ఆదేశించింది. అయితే, సీబీఐ దర్యాప్తునకు మాత్రం సహకరించాలని కోరింది. కోర్టు ఆదేశాలు వెలువడగానే డాక్టర్ సుధాకర్ ఆసుపత్రి సూపరింటెండెంట్కు లేఖ రాశారు. దీంతో ఆయనను డిశ్చార్జ్ చేసినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.కానీ ఆయనకు ఇంకా చికిత్స అందించాల్సిన అవసరం ఉందని, వేరే ఆసుపత్రిలోనైనా చేర్పించి చికిత్స అందించాలని ఆసుపత్రి వైద్యులు ఆయన కుటుంబ సభ్యులకు సూచించారు.