Easwar Mahadev Temple: మనదేశంలోని కొన్ని ఆలయాల్లో ఇప్పటికీ జరుగుతున్న కొన్ని అద్భుతాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. వాటి వెనుక భగవంతుడి లీల అని భక్తులు విశ్వసిస్తుంటారు. అలాంటి అధ్బుత ఆలయం ఒకటి మధ్యప్రదేశ్ రాష్ట్రం మోరేనా జిల్లాలో ఉంది. పకృతి అందాల నడుమ దట్టమైన అరణ్య ప్రాంతంలో ఎత్తైన కొండపై ఉన్న ఈశ్వర మహాదేవ్ ఆలయంలో నిత్యం ఒక అద్భుతం సాక్షాత్కరిస్తుంది. అది ఏమిటంటే ప్రతి రోజు ఆలయ పూజారి వేకువ జామున ఆలయ గర్భగుడి తలుపులు తీసే సమయానికి ఎవరో స్వామివారిని పుష్పాలు, బిల్వదళాలతో పూజించి వెళ్లిపోయినట్లు కనబడుతుంటుంది.
లింగ స్వరూపుడైన స్వామివారిని భ్రహ్మముహూర్తంగా అభిషేకించిన ఆనవాళ్లు ప్రతి రోజు ఆలయ పూజారి గమనిస్తుంటారు. అయితే ఆలయానికి ఎవరు వచ్చి స్వామివారికి పూజిస్తున్నారు అనేది ఎవరికీ అంతుబట్టదు. వేసిన తలుపులు వేసినట్లే ఉంటాయి. పూజ చేసి వెళ్లినట్లు స్పష్టమైన ఆధారం కనబడుతుంటుంది. వేకువ జాము 4 గంటలకే ఓ సిద్ధ యోగి ఇక్కడకు వచ్చిన స్వామివారికి పూజిస్తుంటారని అక్కడి వారు చెబుతుంటారు. అయితే వచ్చేది ఎవరు, ఎటు నుండి వచ్చి వెళుతారు అనేది ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు.
ఈ ఆలయంలో మరో విశేషం ఏమిటంటే ఏడాది పొడవునా 365 రోజులు సహజ సిద్ధంగా శివలింగంపైన నీరు పడుతూనే ఉంటుంది. రాజుల కాలం నుండి కూడా ఎందరో ఆలయానికి ఎవరు వచ్చి పూజలు చేస్తున్నారు అనేది తెలుసుకునేందుకు ప్రయత్నించినా విఫలమైనట్లు చెబుతుంటారు. అయితే ఈ విశేషానికి సంబంధించి రెండు మూడు విధాలుగా ప్రచారంలో ఉంది. ఈ శివలింగాన్ని రావణుడి తమ్ముడైన విభీషణుడు ప్రతిష్టించారనీ, పురాణాల ప్రకారం సప్త చిరంజీవుల్లో విభీషణుడు కూడా ఒకరని, శివలింగాన్ని ఆయనే ప్రతిష్టించారు కనుక నేటికీ ఆయనే వచ్చి శివుడి పూజార్చన చేస్తున్నారని అక్కడి స్థానికుల నమ్మకం. మరో కథనం ఏమిటంటే రాందాస్ జీ మహారాజ్ అనే సన్యాసి గతంలో ఇక్కడ తపస్సు చేశారనీ, అయితే ఆయన శరీరాన్ని వదిలిపెట్టినప్పటికీ అదృశ్య రూపంలో క్రమంతప్పకుండా ఇక్కడ పూజలు చేస్తుంటారని చెబుతుంటారు.