కర్నూలు, మార్చి 1: పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఆమె భర్త వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి శుక్రవారం వైసిపికి రాజీనామా చేశారు.
గత ఎన్నికల్లో పాణ్యం అసెంబ్లీ సిగ్మెంట్ నుండి గౌరు చరితపై పోటీ చేసి ఓటమి పాలైన కాటసాని రాంభూపాల్రెడ్డి కొంత కాలం క్రితం వైసిపిలో చేరారు.
పాణ్యం నియోజకవర్గంలో గౌరు చరితారెడ్డి, కాటసాని రాంభూపాల్రెడ్డి మధ్య ఆధిపత్య పోరు నెలకుని ఉంది. పాణ్యం అసెంబ్లీ సెగ్మెంట్పై గౌరు చరితారెడ్డికి వైసిపి నుండి స్పష్టమైన హామీ లభించకపోవడంతో ఇటీవల పార్టీ మారే అంశంపై ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి తదితరులు గౌరు దంపతులను పార్టీ వీడకుండా ఉండేందుకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేసినా ఫలితం లభించలేదు.
శుక్రవారం పార్టీకి రాజీనామా చేసినట్లు గౌరు చరిత ప్రకటించారు. ఈ నెల తొమ్మిదవ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు గౌరు చరితారెడ్డి మీడియాకు వెల్లడించారు. పాణ్యం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తెలిపారు.