విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలు కొనసాగుతున్నాయి. శరన్నవరాత్రి వేడుకల్లో అయిదవ రోజు బుధవారం మూలానక్షత్రం పురస్కరించుకుని దుర్గామాతను సరస్వతి దేవిగా అలంకరించారు. సరస్వతి దేవి అలంకారంలో ఉన్నఅమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు మెట్లు ఎక్కి వెళుతున్నారు. మరో పక్క నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆలయానికి వస్తుండటంతో పెద్ద ఎత్తున పోలీసులు అధికారులు, సిబ్బంది ఆలయం వద్ద బందోబస్తు విధులను నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకుని భక్తుల రాకపోకలు ఆ వైపు నిలిపివేశారు. ఒక వైపు భక్తులు అందరూ మెట్లు ఎక్కి వెళ్లిపోతుండటం, అక్కడ పోలీసు అధికారులు బందోబస్తు నిర్వహిస్తున్న సమయంలో ఒక్క సారిగా కొండచరియ విరిగి పడటం ఆ ప్రదేశంలో నిల్చున్న వారు అంతా ఒక్క సారిగా పరుగు లంకించుకున్నారు. చాలా మంది స్వల్పగాయాలతో బయటపడ్డారు. అక్కడ ఉన్న రేకుల షెడ్డు పూర్తిగా దెబ్బతిన్నది.
ఇటీవల కురిసిన వర్షాల కారణంగా చిన్న చిన్న రాళ్లు పడుతూ ఉండటంతో అధికారులు అప్రమత్తమై పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. కొండ చరియలు విరిగి పడే అవకాశం ఉందని ఇంజనీరింగ్ అధికారుల హెచ్చరికలతో అక్కడ హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. ఉత్సవాల సమయంలో ఈ ఘటన జరగడం భక్తులను తీవ్ర భయాందోళనను కల్గించింది. ముఖ్యమంత్రి పర్యటనకు కొద్ది సేపటి ముందు ఈ ఘటన జరగడంతో అధికారులు ఉరుకులు పరుగుల మీద సహయక చర్యలు చేపట్టడంతో పాటు శిధిలాల తొలగింపు యుద్ధ ప్రాతిపదికన చేశారు. అనంతరం ముఖ్యమంత్రి కొండచరియలు పడిపోయిన ప్రదేశాన్ని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కొండ చరియ ఎలా విరిగిపడిందో ఈ కింది వీడియోలో చూడండి…