(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: మీడియా ప్రతినిధులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎబిఎన్, టివి 5 ఛానళ్ళపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. మహిళా పోలీసులతో టివి 5, ఈటివీ, ఈనాడు ప్రతినిధులపై ఫిర్యాదు చేయించి అక్రమ కేసులు పెట్టించారని రామకృష్ణ ఆరోపించారు. తక్షణమే మీడియా ప్రతినిధులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలోనూ మంత్రులు ఎమ్మెస్వోలను బెదిరించి ఆయా ఛానళ్ళ ప్రసారాలను నిలిపివేయించారనీ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మొట్టికాయలు వేసిన తరువాత ప్రసారాలు పునరుద్ధరించారనీ గుర్తు చేశారు. ఇప్పుడు ఏకంగా మీడియా ప్రతినిధులపైనే అక్రమ కేసులకు తెరలేపారని రామకృష్ణ విమర్శించారు.