ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తగ్గడంలేదు. వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రదర్శించే స్పస్టమైన వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలు అభివృద్ధి వికేంద్రీకరణ విషయంలో ప్రభుత్వం ఎంతటి స్పష్టతతో ఉందో తేల్చి చెప్తోంది.
ఇదే సమయంలో విశాఖలో కార్యనిర్వాహక రాజధానిన నిర్ణయం సీఎం జగన్ అంత ఆషామాషీగా తీసుకోలేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
విశాఖ… మినీ భారత్!
వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నడూ లేని విధంగా విశాఖ నగరాభివృద్ధి కోసం రూ.1300 కోట్లు కేటాయించారు ఇప్పటికే విభిన్న సంస్కృతుల ప్రజలతో మినీ భారత్ను తలపిస్తున్న విశాఖ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీంతో అక్కడ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా మెట్రోపాలిటన్ కల్చర్ కోసం శ్రమించాల్సిన అవసరం ఉండదు. దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే రాజధానిని తీర్చిదిద్దడానికి ఇబ్బంది ఉండదు.
ఇప్పటికే జగన్ మ్యాప్ రెడీ
ఇక మౌళిక సదుపాయాల పరంగా చూస్తే విశాఖకు రోడ్డు, రైలు, విమానయాన, నౌకాయన సదుపాయం ఉండటం అత్యంత కలిసివచ్చే అంశం. వనరుల పరంగా కూడా విశాఖ జిల్లా ప్రతిష్టాత్మక స్థితిలోనే ఉంది. ఇప్పటికే ఏపీ సీఎం జగన్ కేవలం విశాఖకే అభివృద్ధి పరిమితం కాకుండా ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలను ప్రగతి పథంలోకి తీసుకుపోయే ప్రణాళిక రచించారని సమాచారం. కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలు కార్యనిర్వాహక రాజధానికి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి జై కొట్టడం ఖాయం.
టీడీపీ బాధ ఇదేనా?
మరోవైపు ఇంకో కొత్త వాదన సైతం ఈ సందర్భంగా తెరమీదకు వస్తోంది. ఉత్తరాంధ్ర టీడీపీ అడ్డా అంటూ చెప్పకోవడం మినహా చేసింది ఏమీ లేదనే భావన పలువురు వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడుల సదస్సుల పేరుతో చేసిన వందల కోట్ల ఖర్చులో సగం కూడా పెట్టుబడులు రాష్ట్రానికి రాలేదు. అందులో విశాఖకు దక్కినవి అతి తక్కువ. దీంతో సహజంగానే ఇక్కడి ప్రజల్లో అసంతృప్తి ఉంది. ఏపీ సీఎం జగన్ పక్కా ప్లానింగ్తో ముందుకు వెళితే ఆ నిరాశ దూరమవడం ఖాయం. విశాఖలో మెట్రో, ట్రామ్ కారిడార్ల ఏర్పాటుతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు ఇప్పటికే జగన్ శ్రీకారం చుట్టారు. పెట్టుబడులను ఆకర్షించడానికి కూడా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇవన్నీ సఫలీకృతం అయితే ఉత్తరాంధ్రలో అమాంతం పెరిగిపోవడం ఖాయమని అంటున్నారు.
కేంద్రం కూడా ఓకే అనేసిందిగా!
ఇదిలాఉండగా, ఇప్పటికే పలు సందర్భాల్లో ఏపీలో మూడు రాజధానులపై తన వైఖరిని స్పష్టం చేసిన కేంద్రం ప్రభుత్వం.. మరోసారి.. క్లారిటీ ఇచ్చింది. రాజధాని అంశం మా పరిధిలో లేదంటూ కేంద్ర సర్కార్ తేల్చేసింది. హైకోర్టు ఇచ్చిన నోటీసులపై మరోసారి స్పందించింది కేంద్రం.. సీఆర్డీఏ చట్టం రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులపై హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధానులను నిర్ణయించుకునే హక్కు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అంశం అని పేర్కొన్న కేంద్రం.. ఇదే అంశాన్ని మళ్లీ ఏపీ హైకోర్టుకు తెలియజేసింది. రాజధాని అంశం తమ పరిధిలోకి రాదని స్పష్టం చేసింది… ఏపీ రాజధాని అంశంలో జోక్యం చేసుకోబోమని తేల్చిచెప్పింది. దీంతో సీఎం జగన్ తన నిర్ణయాన్ని భేషుగ్గా అమలు చేయడమే మిగిలిందని అంటున్నారు.