ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి నవరత్న పథకాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో తొలి ఏడాదిలోనే 90 శాతం నెరవేర్చారు. సంక్షేమ పథకాల అమలునకు సంబంధించి క్యాలెండర్ ను కూడా విడుదల చేశారు. ప్రధానంగా ఓ ముఖ్యమైన పథకానికి పేరు అయితే మార్చారు. కానీ పథకాన్ని ఇప్పటి వరకూ అమలు చేయలేదు. ప్రభుత్వం ఏర్పాటై మూడేళ్లు అవుతున్నా ఆ పథకాన్ని ప్రారంభించకపోవడంతో ఆ పథకానికి మంగళం పాడినట్లేనని అందరూ అనుకున్నారు. అయితే తాజాగా ప్రభుత్వం ఆ పథకాన్ని అక్టోబర్ 1వ తేదీ నుండి అమలు చేయాలని నిర్ణయానికి వచ్చింది. అదే వైఎస్ఆర్ కళ్యాణ మస్తు. షాదీ తోఫా పథకాలు.
రాష్ట్రంలో దారిద్ర రేఖకు దిగువను ఉన్న వివిధ పేద వర్గాలకు చెందిన వారు వివాహాలు చేసుకుంటే ప్రభుత్వం గతం నుండి వధూవరులకు ఆర్థిక సహాయం ఇస్తుండేది. గత ప్రభుత్వ హయాంలో చంద్రన్న పెళ్లి కానుకగా అమలు చేయగా , వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్ఆర్ పెళ్లి కానుకగా దానికి పేరు మార్పుచేశారు. దీనికి సంబంధించిన వెబ్ సైట్ లో పేరు మార్పు చేశారు గానీ వివాహాలు చేసుకున్న నూతన వధువరులకు ప్రభుత్వం నుండి నిధులు మాత్రం విడుదల కాలేదు. సార్వత్రిక ఎన్నికలకు ముందు పెళ్లి చేసుకున్న వారికి గానీ ఆ తరువాత ఈ మూడేళ్లలో వివాహాలు చేసుకున్న వారికి గానీ ప్రభుత్వం నుండి ఒక్క రూపాయ కూడా విడుదల కాలేదు. రాష్ట్రంలోని పేద వర్గాల వారు పెళ్లి కానుక పునరుద్దరణ కోసం ఎదురు చూపులు చూస్తున్నారు.
కేటగిరిల వారీగా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు చెందిన వారికి లక్ష రూపాయలు, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు చెందిన కులాంతర వివాహాలు చేసుకుంటే లక్షా 20వేలు, బీసీ వర్గాలకు చెందిన రూ.50వేలు, కులాంతర బీసీ వివాహాలకు రూ.75లు, మైనార్టీలకు లక్ష రూపాయలు, అంగవైకల్యం చెందిన వారికి లక్షా 50వేలు, కూలీల పిల్లలకు లక్ష రూపాయల వరకూ ఆర్థిక సహాయాన్ని పెంపుదల చేస్తూ వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం గతంలోనే నిర్ణయంచింది. గతంలో ఉన్న ఆర్థిక సహాయాన్ని కొంత మేర అయితే పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు గానీ మూడేళ్లుగా ఈ పథకాన్ని కొనసాగించలేదు. అయితే ప్రభుత్వం సంక్షేమ పథకాల క్యాలెండర్ లో జగనన్న వసతి దీవెన, విద్యాదీవెన, రైతులకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ రబీ, డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ ఉచిత పంటల భీమా, రైతు భరోసా, మత్స్యకార భరోసా, జగనన్న విద్యాకానుక, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ వాహన మిత్ర, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న తోడు, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ఇలా పథకాలతో ఏప్రిల్ నుండి ఫ్రిబవరి వరకూ ప్రకటించి అమలు చేస్తొంది.
వీటిలో వైఎస్ఆర్ పెళ్లి కానుకను చేర్చకపోవడంతో జగనన్న ఈ పథకానికి మంగళం పాడారా అన్న అనుమానం ప్రజల్లో నెలకొంది. ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్యేలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో తిరుగుతుండగా ప్రజల నుండి ఈ పథకంపై ప్రశ్నిస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి .. వైఎస్ఆర్ పెళ్లి కానుక,. షాదీ తోఫా పథకాల అమలుపై క్లారిటీ ఇచ్చేశారు. సీఎం జగన్ ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం శనివారం రాత్రి ఈ పథకం అమలునకు సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకాన్ని అక్టోబర్ 1 నుండి అమలు చేయనున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది.
Reag More: ఆ విభాగాల విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం