వచ్చే ఎన్నికల నేపథ్యంలో వైసిపి అధినేత జగన్ ఎవరు ఊహించని విధంగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మహామహులు, మంత్రులు.. సీనియర్ నేతలు అనుకున్న వారి స్థానాలని ఎడాపెడ మార్చేస్తున్నారు. కొందరికి సీటు లేకుండా చేస్తున్నారు. వైసీపీకి రాజీనామా చేసి రెండు నెలల క్రితం కాంగ్రెస్లో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి సొంతగూటికి చేరారు. మంగళగిరిలో ఆర్కే కు సీటు లేదని చెప్పడంతో అలిగి ఆయన వైసీపీని వీడి కాంగ్రెస్ గూటికి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తిరిగి పార్టీలోకి వచ్చిన ఆళ్ళ రామకృష్ణారెడ్డికి జగన్ మరో ఎమ్మెల్యే సీటు కేటాయిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది.
మంగళగిరి నుంచి 2014 – 2019 ఎన్నికలలో వరుసగా రెండుసార్లు గెలిచిన ఆర్కే కు గత ఎన్నికల ప్రచారంలో జగన్.. అక్కడ టీడీపీ నుంచి పోటీలో ఉన్న లోకేష్ను ఓడిస్తే మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు.. ఆ హామీ నెరవేర్చలేదు. సరిగ్గా ఆళ్ల చేసిన పనులకు బిల్లులు కూడా చెల్లించలేదు. దీనికి తోడు ఈసారి లోకేష్ పై బీసీ అభ్యర్థిగా గంజి చిరంజీవికి ఛాన్స్ ఇచ్చారు. ఇక తిరిగి పార్టీలోకి వచ్చిన ఆర్కేకు మంగళగిరి కాకుండా సత్తెనపల్లి నుంచి పోటీ చేసేలా జగన్ ఒప్పించినట్లు తెలుస్తోంది. సత్తెనపల్లిలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అంబటి రాంబాబును మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయించే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.
మచిలీపట్నం ఎంపీగా ఇప్పటికే సింహాద్రి రమేష్ బాబును వైసీపీ అధిష్టానం ప్రకటించింది. ఆయన అవనిగడ్డ నుంచి ప్రస్తుత వైసిపి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక అవనిగడ్డ నుంచి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ పేరును జగన్ ఖరారు చేశారు. అయితే ఆయన వయోభారం కారణంగా తన కుమారుడికి సీటు ఇవ్వాలని కోరారు. దీనిపై జగన్ అంత సుముఖంగా లేరని తెలుస్తోంది. ఈ సమయంలో అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ తాను తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సింహాద్రి రమేష్ కు తిరిగి అవనిగడ్డ అసెంబ్లీ సీటు కేటాయించి.. సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబును మచిలీపట్నం ఎంపీ బరిలోకి దించి… సత్తెనపల్లి నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డిని పోటీకి దింపుతారని తెలుస్తోంది.
ఇప్పటికే సత్తెనపల్లి నుంచి టిడిపి అభ్యర్థిగా కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు. ఇక మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా టిడిపి – జనసేన కుటమి నుంచి వల్లభనేని బాలశౌరి పోటీ చేస్తున్నారు. ఆయన కూడా గుంటూరు జిల్లాకు చెందిన నేత. ఇప్పుడు అంబటి రాంబాబు కూడా గుంటూరు జిల్లాకు చెందిన నేతకావడంతో ఇద్దరి మధ్య హోరాహోరీ ఉంటుందని వైసీపీ అంచనా వేస్తోంది. ఇక సత్తెనపల్లిలో కాపు నేత అంబటిపై రెడ్డి వర్గానికి చెందిన ఆళ్లను పోటీ చేయిస్తే సలువుగా గెలవవచ్చన్నదే జగన్ ప్లాన్?