జగన్ దెబ్బతో ఐదేళ్లలో అటు చంద్రబాబు, ఇటు పవన్ ఇద్దరికి చుక్కలు కనపడ్డాయి. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని భావించిన చంద్రబాబు, పవన్ ఇద్దరూ కలిసి బరిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలోనే పొత్తులు పెట్టుకున్నారు. అక్కడకు జగన్ను ఢీ కొట్టేందుకు తమ బలం సరిపోదని డిసైడ్ అయ్యి ఢిల్లీ వెళ్లి రెండు రోజులు మకాం వేసి బీజేపీ పెద్దలను బతిమిలాడి ఒప్పించి మరీ తమ కూటమిలోకి రావాలని విజ్ఞప్తి చేసుకుని చేర్చుకున్నారు.
ఇక పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి చంద్రబాబు 30 అసెంబ్లీతో పాటు 8 పార్లమెంటు సీట్లు కేటాయించారు. ఇక పొత్తులు కుదిరిన చోట్ల టీడీపీకి సీటు ఇస్తే జనసేన కేడర్ సపోర్ట్ చేయడం లేదు. ఇటు జనసేనకు సీటు ఇస్తే అక్కడ టీడీపీ కేడర్ సపోర్ట్ చేయట్లేదు. ఇక మాజీ మంత్రి పి. నారాయణ ఈ సారి నెల్లూరు సిటీ నుంచి టీడీపీ తరపున అసెంబ్లీకి పోటీ పడుతున్నారు.
గత ఎన్నికల్లో మంత్రిగా ఉండి కూడా నారాయణ నెల్లూరు సిటీలో అనిల్కుమార్ యాదవ్ చేతిలో ఓడిపోయారు. ఈ సారి అనిల్ అక్కడ పోటీలో లేరు. దీనికి తోడు జనసేనతో పొత్తు ఉంది. నారాయణ గెలుపు నల్లేరుమీద నడకే కావాలి. కానీ నారాయణ ఒంటెత్తు పోకడలతో జనసేన కేడర్ను కలుపుకోకుండా ముందుకు వెళుతున్నారు. దీంతో జనసేన కేడర్కు చిర్రెత్తుకొచ్చింది. నారాయణ చెపుతోన్న మాటలు , చేస్తోన్న పనులు అన్నీ ఏకపక్షంగానే ఉంటున్నాయట.
అసలు పొత్తులో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జనసేనకు కాస్తో కూస్తో పట్టున్న నెల్లూరు సిటీ సీటును తమకే కావాలని జన సైనికులు బలంగా కోరారు. అక్కడ నుంచి జనసేన తరపున పోటీ చేయాలని జనసేన నేత మనుక్రాంత్ రెడ్డి ఎంతగానో ఆశపడ్డారు. అయితే చంద్రబాబు నారాయణ కోసం ఆ సీటు వదులుకునేందుకు ఎంత మాత్రం ఇష్టపడలేదు. ఇప్పుడు నారాయణ సీటు ఎత్తుకు పోవడంతో పాటు జనసేన కేడర్ను కలుపుకోకుండా వెళుతుండడంతో జనసేన కేడర్ అయితే తాము నారాయణకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించమని.. నారాయణను ఓడించి తీరుతామని శపథాలు చేస్తున్నారు.