ఏపీలో తెలుగుదేశం, జనసేన పార్టీల పొత్తు కొన్ని నియోజకవర్గాలలో తీవ్ర గందరగోళానికి కారణం అవుతుంది. మరీ ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాలలో అటు జనసేన నుంచి ఇటు టిడిపి నుంచి బలమైన అభ్యర్థులు రేసులో ఉండడంతో.. ఏం చేయాలో తెలియక అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు తీవ్రంగా సతమతమవుతున్నారు. ఇప్పటికే తొలి జాబితాలో జనసేన 5 సీట్లకు తమ అభ్యర్థులను ప్రకటించింది. ఈరోజు లేదా రేపు రిలీజ్ అయ్యే రెండో జాబితాలో మరో 10 స్థానాలకు పవన్ కళ్యాణ్ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తారు అంటూ ప్రచారం జరుగుతుంది. కొన్నిచోట్ల ఇప్పటికి అభ్యర్థులను ప్రకటించకపోవడంతో జనసేన అభ్యర్థులు తమకు సీటు వస్తుందా..? రాదా..? అన్న సందేహంలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో.. జనసేన పోటీ చేసే దర్శి నియోజకవర్గంలో.. రాజకీయంగా గందరగోళం నెలకొంది.
దర్శి నియోజకవర్గం నుంచి జనసేన తరపున ఎన్ఆర్ఐ గా ఉన్న గరికపాటి వెంకట్ పోటీ చేస్తారు అంటూ ప్రచారం జరుగుతుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో.. చీరాల, దర్శి, గిద్దలూరు స్థానాలను జనసేన పరిశీలించింది. అయితే చీరాలకు చెందిన జనసేన నేత ఆమంచి స్వాములు.. చీరాల లేదా గిద్దలూరు సీటు ఆశించారు. స్వాములకు సీటు వస్తుందా రాదా అన్న సందిగ్ధత నెలకొంది. అయితే దర్శి నుంచి ఎన్నారై గరికిపాటి ఢపేరు రేసులో బలంగా ముందు నుంచి వినిపిస్తోంది. అయితే గత వారం రోజులుగా గరికపాటి వెంకట్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఆజ్ఞాతంలోకి వెళ్లినట్టు.. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ప్రచారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ తనకు సీటు ఇస్తేనే నియోజకవర్గంలోకి అడుగుపెడతానని.. లేకపోతే నియోజకవర్గంలోకి తాను ఎంటర్ కానని జనసేన రాష్ట్ర నాయకులు వెంకట్ సమాచారం చేరవేసి మరి ఎవరికి అందుబాటులోకి లేకుండా వెళ్లిపోయినట్టు ప్రచారం జరుగుతుంది.
ఓవైపు దర్శిలో అధికార వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పేరు కరారు అయింది. ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. చివరకు దర్శి సీటు జనసేనకు ఇస్తారా..? లేదా తెలుగుదేశం పోటీ చేస్తుందా..? అన్నది క్లారిటీ లేదు. జనసేన జిల్లాలో దర్శి లేదా గిద్దలూరులో ఏదో ఒక సిటీ నుంచి పోటీ చేస్తుందంటూ ప్రచారం జరుగుతుంది. తనకు గ్యారంటీగా సీటు వస్తుంది అన్న నమ్మకం లేకపోవడంతో గరికపాటి వెంకట్ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. కచ్చితంగా పవన్ కళ్యాణ్ సీటు ఇస్తానంటేనే.. ఖర్చు పెట్టుకుంటానని.. లేకపోతే అనవసరంగా చేతి చమురు వదిలించుకోవడం ఎందుకు అని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా జనసేన పోటీ చేసేది తక్కువ స్థానాలు అయినా.. బలమైన అభ్యర్థులు లేక టికెట్లపై స్పష్టమైన హామీలు రాక.. పలు నియోజకవర్గాలలో ఇలాంటి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.