ఏపీలో టీడీపీ – జనసేన పొత్తు నేపథ్యంలోనే టీడీపీ వాళ్లు సీట్లు త్యాగం చేయలేని పరిస్థితి ఉంది. పైగా టీడీపీ బలంగా ఉన్న ఉభయగోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నంలోనే ఎక్కువ సీట్లు త్యాగం చేయాల్సి రావడంతో టీడీపీలో ఉన్న బలమైన నేతలను పక్కన పెట్టాల్సి వస్తోంది. అయితే ఆయా సీట్లలో జనసేన పోటీలో ఉన్నా కూడా టీడీపీ ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి లేదు. 15 – 20 ఏళ్ల పాటు అక్కడ టీడీపీ తరపున రాజకీయం చేస్తూ బలమైన నేతలుగా ఉన్న వారిని పక్కన పెట్టేసి జనసేనకు సీటు ఇవ్వడంతో వాళ్లతో పాటు వాళ్లను నమ్ముకున్న కేడర్ కూడా కాడి కిందపడేసి చోద్యం చూసే పరిస్థితే ఉంది. ఇదే జరిగితే జనసేన ఖచ్చితంగా ఓడిపోవడం పక్కాగా కనిపిస్తోంది.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 15 సీట్లు ఉంటే జనసేనకు ఏకంగా 6 సీట్లు ఇస్తున్నారు. ఇందులో నరసాపురం, భీమవరంలో గత ఎన్నికల్లో జనసేన రెండో ప్లేస్లో ఉంది. వీటితో పాటు గతంలో ప్రజారాజ్యం గెలిచిన తాడేపల్లిగూడెం సీట్ల వరకు పెద్దగా అభ్యంతరాలు లేవు. అయితే జనసేనకు 10 వేలకు కాస్త అటూ ఇటూగా ఓట్లు వచ్చిన ఉంగుటూరు, పోలవరంతో పాటు నిడదవోలు సీట్లు ఇవ్వడంతో అక్కడ పార్టీని ఏళ్ల పాటు నడిపిస్తోన్న నాయకులు, పార్టీ కేడర్ జనసేనకు సహకరించే పరిస్థితి ఎంతమాత్రం లేదు.
ఉంగుటూరులో ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు 20 ఏళ్లుగా పార్టీని నడిపిస్తున్నారు. పైగా పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించి సమర్థవంతంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీని గాడిన పెట్టిన గన్ని సీటు జనసేనకు ఇచ్చేస్తున్నారు. ఇక్కడ జనసేనకు గత ఎన్నికల్లో 10 వేల ఓట్లు వస్తే… టీడీపీకి 62 వేల పై చిలుకు ఓట్లు వచ్చాయి. ఇక్కడ టీడీపీ కేడర్ జనసేనను అన్ని గ్రామాల్లో సమన్వయం చేసుకునే పరిస్థితి లేదు. గన్ని టీడీపీ కేడర్కు ఎంత సర్దిచెప్పినా కొన్ని పంచాయతీల్లో ఓట్లు అస్సలు బదిలీ అయ్యే పరిస్థితి లేదు. ఉంగుటూరు సీటును చేజేతులా కూటమి కోల్పోతున్న వాతావరణమే అక్కడ ఉంది.
ఇక పోలవరం పరిస్థితి అంతే. అసలు పోలవరంలో గత ఎన్నికల్లో జనసేనకు వచ్చిన ఓట్లు కేవలం 13 వేలు. ఈ నియోజకవర్గంలో ఏడు మండలాల్లోనూ టీడీపీకి సంస్థాగతంగా మంచి పట్టు ఉంది. పైగా గత ఎన్నికల్లో ఓడిన బొరగం శ్రీను ఐదేళ్లపాటు నియోజకవర్గంలో పార్టీని ఎంతో పటిష్టం చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆయనకు సీటు ఇస్తే ఖచ్చితంగా గెలుస్తారనుకుంటోన్న టైంలో ఏజెన్సీలో అస్సలు పట్టులేని జనసేనకు సీటు ఇస్తుండడంతో టీడీపీ కేడర్ ఒక్కసారిగా డీలాపడిపోయింది. ఈ ఎస్టీ నియోజకవర్గంలో వైసీపీ చాలా స్ట్రాంగ్. ఆ పార్టీని ఓడిచడం జనసేన వల్ల ఏ మాత్రం సాధ్యం కాదనే చెప్పాలి.
ఇక నిడదవోలులో పదిహేనేళ్ల నుంచి మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. రెండుసార్లు గెలిచిన ఆయన ఒక్కసారి ఓడారు. ఈ సారి రాజమండ్రి రూరల్ సీటు ఈక్వేషన్ కుదరక అక్కడ నుంచి కందుల దుర్గేష్ను ఇక్కడకు షిఫ్ట్ చేశారు. ఇప్పటికే శేషారావు కేడర్ను మీ ఇష్టం వచ్చినట్టు ఓట్లేసుకోండి.. పనిచేసుకోండి.. నేను ఇన్వాల్ కానని చెప్పడంతో పాటు పరోక్షంగా ఇక్కడ జనసేనకు సపోర్ట్ చేయనని చెప్పకనే చెప్పేశారు. ఏదేమైనా ఉమ్మడి పశ్చిమగోదావరిలో జనసేన పోటీ చేసే 6 సీట్లలో నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం మినహా మిగిలిన మూడు సీట్లలో ఓట్ల బదిలీ పర్ఫెక్ట్గా జరిగి జనసేన గెలుస్తుందన్న నమ్మకాలు అయితే కనపడడం లేదు.