BJP: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో జనసేనతో బీజేపీ పొత్తు ఉండకపోవచ్చని కేంద్ర మంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. 17 పార్లమెంట్ స్థానాల్లో ఒంటరిగానే బీజేపీ పోటీ చేస్తుందని చెప్పారు. జనసేన ప్రస్తుతం ఎన్డీఏలో భాగస్వామిగా ఉందని, ఏపీలో జనసేనతో పొత్తు అంశం చర్చకు రాలేదని అన్నారు.
మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 7,8 తేదీల్లో బీజేపీ నేతల సమావేశం ఉంటుందని చెప్పారు. కొత్త ఎన్నికల కమిటీ ఏర్పాటు చేసుకుంటామని తెలిపారు. సిట్టింగ్ ఎంపీలకు సీటు గ్యారెంటీ అని ఎక్కడా చర్చ జరగలేదని సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీ నుండి మంద కృష్ణమాదిగ ఎంపీగా పోటీ చేసే అంశం చర్చకు రాలేదని అన్నారు. ఆయన మాదిగ రిజర్వేషన్ల కోసం పని చేస్తున్నారని అన్నారు. ఎల్పీ నేత ప్రకటన అమిత్ షా వచ్చిన రోజే ప్రకటించాల్సిందని, ఢిల్లీ నుండి వచ్చే పరిశీలకులు ఎల్పీ నేత పై ప్రకటన చేస్తారని తెలిపారు.
కాగా, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న నేతలు కిషన్ రెడ్డిని కలుస్తున్నారు. తమకు అవకాశం కల్పించచాలని కోరుతున్నారు. మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, రాణి రుద్రమ దేవి లు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కిషన్ రెడ్డి వద్ద అభ్యర్ధన పెట్టారు.
మల్కాజ్ గిరి లోక్ సభ సీటును చాడా సురేష్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, పన్నాల హరీష్ రెడ్డి ఆశిస్తున్నారు. మల్కాజ్ గిరి లోక్ సభ స్థానానికి బీజేపీలో ఫుల్ డిమాండ్ ఉంది. మల్కాజ్ గిరి నుండి పోటీ చేస్తానని ఇప్పటికే మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ భువనగిరి నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆశావహులు అందరూ కిషన్ రెడ్డిని కలిసి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.