YV Subba Reddy: తాను వైఎస్ షర్మిలతో ఎటువంటి రాయబారం చేయలేదని వైఎస్ఆర్ సీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. షర్మిల ఏపీ కాంగ్రెస్ లోకి వస్తున్న నేపథ్యంలో సీఎం జగన్మోహనరెడ్డి తరపున కుటుంబ పెద్దగా వైవీ సుబ్బారెడ్డి షర్మిల వద్దకు రాయబారం జరిపారని మీడియాలో వచ్చిన కథనాలపై ఆయన స్పందించారు. తాను ఎవరి కోసమూ షర్మిల తో రాయబారం చేయలేదన్నారు.
తాను రెండు మూడు వారాలకు ఒక సారి హైదరాబాద్ వెళుతుంటానని, కుటుంబ సభ్యులను కలుసుకుంటుంటానని చెప్పారు వైవీ సుబ్బారెడ్డి. అదే క్రమంలో విజయమ్మ అమెరికా నుండి వచ్చాక వెళ్లి కలిశానని వివరణ ఇచ్చారు. కానీ ఎల్లో మీడియా రాతలు పరాకాష్టకు చేరాయన్నారు. కుటుంబ సభ్యులనూ బజారుకీడ్చే పని చేస్తొందని దుయ్యబట్టారు. చంద్రబాబు, పవన్ అందరూ కలిసి కుట్రలు పన్ని ఇలాంటి వార్తలు రాయిస్తున్నారని విమర్శించారు.
షర్మిల ముడేళ్ల క్రితం తెలంగాణ లో పార్టీ పెట్టారనీ, ఈ మధ్య కాంగ్రెస్ లో చేరుతున్నారని కూడా వస్తున్నాయని, దానిపై తమకు క్లారిటీ లేదన్నారు. షర్మిల కాంగ్రెస్ నుండి ప్రచారం చేసినా వైసీపీకి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు. ఎందుకంటే .. తమకు ప్రజా మద్దతు ఉంది కాబట్టి ఎలాంటి కుట్రలు పన్నినా ప్రజల ఆశీర్వాదం తమ పార్టీకి, జగన్ కే ఉందని చెప్పారు.
జగన్ తెచ్చిన సంక్షేమ పథకాలతో పేదల కుటుంబాల్లో మార్పు వచ్చిందని, తమకు ప్రజలే దేవుళ్లు అని అన్నారు వైవీ సుబ్బారెడ్డి. ప్రజారంజకమైన పాలన అందిస్తున్నారు కాబట్టే వైసీపీకి ప్రజల మద్దతు ఉందని, ఈ సారి ఎన్నికల్లోనూ మళ్లీ వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని వైవీ ధీమా వ్యక్తం చేశారు.
YSRCP: వైసీపీకి సీనియర్ నేత దాడి వీరభద్రరావు రాజీనామా.. టీడీపీలో చేరేందుకు మంతనాలు