YS Sharmila: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల .. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్ధులను బరిలో దింపేందుకు దృష్టి పెట్టారు. ఈ క్రమంలో వైసీపీలో టికెట్ లు దక్కని అసంతృప్తులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారు. టిక్కెట్ హామీ ఇస్తుండటంతో నేతలు పార్టీలో చేరుతున్నారు.
నిన్న కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్ధర్ ను పార్టీలో చేర్చుకున్నారు. వైసీపీ ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో కడప జిల్లాకు చెందిన వైద్యుడు డాక్టర్ దారా సుధీర్ ను నియోజకవర్గ ఇన్ చార్జిగా నియమించిన వైసీపీ తాజాగా ఆయన అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేసింది. నందికొట్కూరులో వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వర్గం ఆర్ధర్ ను పూర్తి గా వ్యతిరేకిస్తూ వస్తొంది. ఈ క్రమంలో ఆయన వైసీపీని వీడారు. నిన్న వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తాజాగా ఇవేళ అదే జిల్లాకు చెందిన కోడుమూరు మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీకృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన మురళీకృష్ణ 2014 ఎన్నికల్లో ఓటమి పాలైయ్యారు. ఆ తర్వాత 2016 లో మురళీ కృష్ణ వైసీపీలో చేరారు. అయితే 2019 ఎన్నికలకు ముందు వైసీపీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో టీడీపీలో చేరారు. అయితే వెంటనే అలర్ట్ అయిన జగన్మోహనరెడ్డి 2024 ఎన్నికల్లో తగిన న్యాయం చేస్తానని మురళీకృష్ణను బుజ్జగించడంతో తిరిగి రెండు రోజుల్లోనే వైసీపీలో చేర్చుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మురళీకృష్ణకు టీటీడీ బోర్డు మెంబర్ గా అవకాశం కల్పించారు.
అయితే కోడుమూరు నియోజకవర్గం నుండి వరుసగా 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులు గెలుపొందడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్, మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణతో పాటు ఆరడజను మంది టిక్కెట్ ఆశించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేపై వ్యతిరేకత బాగా ఉండటంతో పార్టీ అధిష్టానం డాక్టర్ ఆదిమూలపు సతీష్ ను అభ్యర్ధిగా ప్రకటించింది. దీంతో మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ కు స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయాలని అనుచరుల నుండి ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలిసింది. అయితే రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలన్న కృతనిశ్చయంతో మురళీ కృష్ణ ఉన్నారు. కాంగ్రెస్ నుండి ప్రతిపాదన రావడంతో వెంటనే షర్మిల తో భేటీ అయ్యారు. ఇవేళ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు.
Shobha Karandlaje: తమిళ ప్రజలకు క్షమాపణలు చెప్పిన కేంద్ర మంత్రి శోభ