YSRCP Gudivada: ఎన్టీఆర్ జిల్లా గుడివాడ వైసీపీలో ఓ వార్త హాట్ టాపిక్ గా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు శత్రువుగా భావిస్తున్న గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానిని తప్పించి, ఆయన స్థానంలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావుకు ఇన్ చార్జి బాధ్యతలు అప్పగిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఆ క్రమంలోనే కాబోయే గుడివాడ వైసీపీ అభ్యర్ధి హనుమంతరావుకు శుభాకాంక్షలు అంటూ పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు వెలిశాయి.
దివంగత సీఎం వైఎస్ఆర్ కుటుంబానికి విధేయుడిగా హనుమంతరావుకు గుర్తింపు ఉంది. ఇప్పుడు ఆయన పేరుతో ఫ్లెక్సీలు కనబడటం గుడివాడ వైసీపీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇందులో వాస్తవం ఉందో లేదో కానీ తెలుగు తమ్ముళ్లు మాత్రం కుషీ అవుతున్నారు. గుడివాడలో హనుమంతరావు ఫ్లెక్సీల వ్యవహారాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు. గతంలో టీడీపీ నుండి చాలా మంది వైసీపీలోకి వెళ్లినా కొడాలి నాని మాత్రమే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ పై వ్యక్తిగతంగా విమర్శలు చేయడంతో టీడీపీ శ్రేణులు ఆయనను శత్రువుగా భావిస్తున్నారు.
ఆ తర్వాత వల్లభనేని వంశీ కూడా వైసీపీ గూటికి చేరిన తర్వాత టీడీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో ఈ ఇద్దరు నేతలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఓడిపోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణులు కోరుకుంటూ వస్తున్నారు. పార్టీ అధిష్టానం కూడా ఈ ఇద్దరు నేతలపై రాబోయే ఎన్నికల్లో ఢీకొట్టేందుకు బలమైన ఎన్ఆర్ఐ నేతలను దింపింది. వాస్తవానికి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి వైసీపీలో ఎదురులేదు. సీఎం జగన్ వద్ద మంచి పలుకుబడి ఉంది. అయితే ఇంత వరకూ ఆయనకు టికెట్ ఖరారు చేయలేదు.
అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభ్యర్ధుల ఎంపిక విషయంలో చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నారు. విధేయత అనే మొహమాటాలకు పోకుండా గెలుపు అవకాశాలు లేవు అని సర్వే రిపోర్టు ఉంటే పక్కకు తప్పించడమో లేక వేరే స్థానానికి బదిలీ చేయడమో చేస్తున్నారు. గుంటూరు నుండి టీడీపీ నుండి వైసీపీలో చేరిన మద్దాలి గిరిథర్ కు టికెట్ ఇవ్వలేదు. గన్నవరం నుండి వైసీపీలో చేరిన వల్లభనేని వంశీని వేరే నియోజకవర్గానికి వెళ్లాలని సూచిస్తున్నట్లు వార్తలు వినబడుతున్నాయి.
సొంత మనిషిగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డికే టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టారు అంటే .. జగన్ వద్ద ఎవరైనా ఒకటే.. గెలుపు అవకాశాలు ఉన్నాయా లేదా అనే ప్రామాణికం అని అంటున్నారు. ఆ క్రమంలో గుడివాడలో టీడీపీ – జనసేన కూటమి అభ్యర్ధిగా వనిగెళ్ల రాము బరిలో నిలుస్తుండటంతో సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా ఈ స్థానాన్ని బీసీ (యాదవ) లేదా కాపు సామాజికవర్గ నేతను వైసీపీ రంగంలోకి దింపే ఆలోచన చేస్తుందని అంటున్నారు.
ఈ క్రమంలోనే కాపు సామాజిక వర్గానికి చెందిన హనుమంతరావు పేరు తెరపైకి వచ్చిందని భావిస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్న హనుమంతరావుకు సీఎం క్యాంపు కార్యాలయం నుంచి పిలుపు కూడా వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో హనుమంతరావుకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలోనూ ప్రచారం జరుగుతోంది. ఫ్లెక్సీలు వెలిశాయి. ప్రస్తుతానికి ఇది పుకారే అయినప్పటికీ తెలుగు తమ్ముళ్లు మాత్రం తెగ ఆనందపడిపోతున్నారు.
ఒక వేళ కొడాలి నానిని ఆ నియోజకవర్గం నుండి తప్పించాల్సి వస్తే జగన్మోహనరెడ్డి కఛ్చితంగా మరో నియోజకవర్గానికి పంపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పార్టీకి రాజీనామా చేస్తున్నందున జోగి రమేష్ ను మైలవరంకు పంపి, కొడాలి నానిని పెనమలూరు పంపుతారేమో చూడాలి మరి. ఇంతకు ముందు ఇన్ చార్జి లుగా ప్రకటించిన వాటిలో మళ్లీ కొన్ని మార్పులు చేసిన కారణంగా వైసీపీలో ఎప్పుడు ఎవరి సీటుకు ఎసరు వస్తుంది అనేది చెప్పలేదని పరిస్థితి నెలకొంది.
Helecopter Service For Medaram Jatara: మేడారం జాతరకు హెలికాఫ్టర్ సేవలు .. టికెట్ ధర ఎంతంటే..?