RK Roja: ఏపీ మంత్రి రోజాకు .. ఆమె సొంత నియోజకవర్గం నగరిలో అసమ్మతి సెగ ఎక్కువగా ఉంది. నగరిలో ఆమెకు వ్యతిరేకంగా వర్గపోరు తీవ్రతరం అయ్యింది. పార్టీ కోసం పని చేసిన వారిని మంత్రి రోజా పట్టించుకోవడం లేదని, ఆమె అన్న, పుత్తూరు వైసీపీ ఇన్ చార్జి కుమార స్వామిరెడ్డి అధిపత్యం మితిమీరిందని స్థానిక నేతలు కొంత కాలంగా ఆగ్రహంతో ఉన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోనూ రోజాకు విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే.
నియోజకవర్గ పరిధిలోని వడమాలపేట జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి, పుత్తూరులో వైసీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఏలుమలై, నిండ్రలో శ్రీశైలం బోర్డు చైర్మన్ చక్రపాణిరెడ్డి, నగరిలో ఈడిగ కార్పోరేషన్ చైర్ పర్సన్ కేజీ శాంతి, ఆమె భర్త, మాజీ మున్సిపల్ చైర్మన్ కేజే కుమార్, విజయపురంలో ఎంపీటీసీ సభ్యుడు లక్ష్మీపతిరాజు లు మంత్రి రోజాకు వ్యతిరేక వర్గంగా ఉన్నారు. వైసీపీలో నియోజకవర్గ సమన్వయకర్తల మార్పుల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి నగరి టికెట్ ఈసారి రోజాకు ఇవ్వరనే ప్రచారం జరుగుతోంది.
ఈ తరుణంలో రోజా పేరను ఒంగోలు వైసీపీ లోక్ సభ స్థానానికి పరిశీలనకు రావడంతో రోజాకు స్థానచలనం తప్పదా అనే ఊహాగానాలు వినబడుతున్నాయి. ఒంగోలులో సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి అవకాశం లేదని ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇస్తూనే ఆ స్థానానికి పలువురు పేర్లు పరిశీలిస్తొంది వైసీపీ. ఆ క్రమంలో దర్శి, కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు నేపథ్యంలో మద్దిశెట్టి వేణుగోపాల్, బుర్రా మధుసూధన్ యాదవ్ పేర్లు తెరపైకి తెచ్చింది.
అయితే మొదటి నుండి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన స్థానాన్ని ఇతరులకు కేటాయించడంతో పార్టీలోనే వ్యతిరేకత రావడంతో రెడ్డి కార్పోరేషన్ చైర్మన్ చింతలచెరుపు సత్యనారాయణరెడ్డి పేరు పరిశీలనకు వచ్చింది. ఆ తర్వాత అనూహ్యంగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పేరు బయటకు వచ్చింది. ఆయన స్వయంగా బాలినేని శ్రీనివాసరెడ్డిని సంప్రదించగా, తాను మాగుంట కోసమే ప్రయత్నిస్తానని చెప్పడంతో చెవిరెడ్డి రేసు నుండి తప్పుకున్నారు. పార్టీ హైకమాండ్ విముఖతతో ఉన్నా బాలినేని మాత్రం మాగుంటకే కేటాయించాలన్న పట్టుదలతో ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారుట.
రెండు రోజుల క్రితం మాగుంట కార్యాలయానికి వెళ్లి బాలినేని ఏకాంతంగా చర్చలు జరిపారు. ఈ తరుణంలోని పార్టీ హైకమాండ్ మంత్రి ఆర్కే రోజా పేరను అనూహ్యంగా తెరిపైకి తీసుకువచ్చింది. రోజా లోక్ సభ అభ్యర్ధి అయితే ఎలా ఉంటుంది అనే దానిపై ఐప్యాక్ టీమ్ సర్వే కూడా చేసిందని అంటున్నారు. వేరే నియోజకవర్గానికి మంత్రి రోజా పేరు పరిశీలనకు వచ్చింది అంటేనే స్థానచలనం తప్పదనే మాట వినబడుతోంది. ఒంగోలు లోక్ సభ టికెట్ రోజా కు కన్ఫర్మ్ అవుతుందా లేదా అనేది తెలియాలి అంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
Kesineni Nani: చంద్రబాబు మూటాముల్లె సర్దుకుని హైదరాబాద్ వెళ్లిపోవడానికి సిదంగా ఉన్నారు – కేశినేని